ఆఖరి మ్యాచ్ కూడా వన్సైడ్గా మారుతుందనుకుంటే అఫ్గానిస్థాన్ అద్భుతంగా పోరాడింది. భారత్తో ఆఖరి వరకు హొరాహొరీగా తలపడింది. రెండో సారి సూపర్ ఓవర్కు దారి తీసిన ఈ ఉత్కంఠ పోరులో అంతిమంగా టీమిండియా ఘన విజయం సాధించింది. మూడు టీ20ల సిరీస్ను 3-0తో రోహిత్ సేన క్లీన్ స్వీప్ చేసింది.
టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన టీమిండియాకు అఫ్గానిస్థాన్ బౌలర్లు షాకిచ్చారు. ఫరీద్ అహ్మద్ (3/20), అజ్మతుల్లా (1/33) ధాటికి భారత్ 22 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. కానీ రోహిత్ శర్మ (121*; 69 బంతుల్లో), రింకూ సింగ్ (69*; 39 బంతుల్లో) అద్భుత పోరాటంతో స్కోరును 212/4కు చేర్చారు. ఆ తర్వాత బ్యాటింగ్కు వచ్చిన అఫ్గానిస్థాన్ 20 ఓవర్లకు 212/6 స్కోరుతో నిలిచి మ్యాచ్ను 'టై' గా ముగించింది. గుర్బాజ్ (50; 32 బంతుల్లో), ఇబ్రహీం జద్రాన్ (50; 41 బంతుల్లో), నైబ్ (55*; 23 బంతుల్లో), నబి (34; 16 బంతుల్లో) పోరాడారు.

సూపర్ ఓవర్లో మొదట బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ 16/1తో నిలిచింది. ముకేశ్ కుమార్ వేసిన తొలి బంతికి నైబ్ రనౌటవ్వగా, తర్వాత నబి, గుర్బాజ్ చెలరేగి పరుగులు సాధించారు. అనంతరం సూపర్ ఓవర్ ఛేజింగ్లో రోహిత్ రెండు సిక్సర్లు సాధించాడు. అయితే ఆఖరి బంతికి రెండు పరుగులు చేయాల్సిన సందర్భంలో జైశ్వాల్ ఒక్క పరుగే చేయడంతో భారత్ కూడా 16/1 తో నిలిచింది. దాంతో ఫలితం కోసం మరో సూపర్ ఓవర్ ఆడాల్సి వచ్చింది.
ఈ సారి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా ఫరీద్ బౌలింగ్లో రెండు వికెట్లు కోల్పోయి 11 పరుగులే చేసింది. తొలి మూడు బంతులకు రోహిత్ 11 పరుగులు చేయగా, తర్వాత భారత్ రెండు వికెట్లు కోల్పోయింది. రింకూ వికెట్ కీపర్ ఇచ్చి వెనుదిరగగా, తర్వాతి బంతికి రోహిత్ రనౌటయ్యాడు. అనంతరం రవి బిష్ణోయ్ అద్భుత బౌలింగ్తో రెండో సూపర్ ఓవర్లో భారత్ ఘన విజయం సాధించింది. తొలి బంతికే నబి ఔటవ్వగా, రెండో బంతికి ఒక్క పరుగు వచ్చింది.మూడో బంతికి గుర్బాజ్ ఔటయ్యాడు.

మ్యాచ్ అనంతరం అఫ్గానిస్థాన్ కెప్టెన్ ఇబ్రహీం జద్రాన్ మాట్లాడుతూ.. గొప్పగా పోరాడమని, కానీ దురదృష్టవశాత్తు సూపర్ ఓవర్లో మ్యాచ్ను చేజార్చుకున్నామని అన్నాడు. ''మా ప్రదర్శన పట్ల సంతోషంగా ఉన్నాం. మేం గొప్పగా ఆడాం. కానీ దురదృష్టవశాత్తు సూపర్ ఓవర్లో ఓటమిపాలయ్యాం. ఈ సిరీస్లో ఎన్నో సానుకూలాంశాలు ఉన్నాయి.
వచ్చే టీ20 ప్రపంచకప్లో ఈ అనుభవం ఉపయోగపడుతుంది. ఈ మూడు మ్యాచ్ల్లో మా ఆటగాళ్లు అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారు. టీ20 క్రికెట్లో ఇలాంటి ఆటను ఎప్పుడూ ఆడలేదు, ముఖ్యంగా భారత్పై. బ్యాటింగ్లో సత్తాచాటాం. ఈ సిరీస్లో పాజిటివ్స్ను కొనసాగిస్తూ వరల్డ్ కప్లో మరింత రాణించేలా సన్నద్ధమవుతాం'' అని జద్రాన్ తెలిపాడు.