హైదరాబాద్: ఆర్నెళ్ల క్రితం ప్రపంచ మహిళా క్రికెట్లో వరల్డ్ కప్ సాధించిన భారత జట్టు దక్షిణాఫ్రికా టూర్కు వెళ్లనుంది. ఈ నేపథ్యంలో భారత్ మహిళా జట్టు స్టార్ బ్యాట్స్మెన్ అయిన హర్మన్ ప్రీత్ కౌర్ తన అభిప్రాయాలను ఇలా వెల్లడించింది.
దక్షిణాఫ్రికా టూర్ సవాళ్లతో కూడుకున్నదని భారత మహిళా జట్టు బ్యాట్స్మన్ హర్మన్ప్రీత్ కౌర్ చెప్పింది. 3వన్డేలు, 5 టీ20ల సిరీ్సలో భాగంగా వచ్చేనెల 5 నుంచి సౌతాఫ్రికాలో భారత మహిళల జట్టు పర్యటించనుంది. టూర్ కఠినమైనా టీమిండియా మెరుగైన ప్రదర్శన చేస్తుందనే ఆత్మ విశ్వాసం వ్యక్తం చేసింది.
ప్రపంచకప్ అనంతరం మేము జాతీయ క్రికెట్ అకాడమీ నిర్వహించిన కొన్ని క్యాంపుల్లో పాల్గొన్నాం. ఈ క్యాంపుల్లో పాల్గొనడం మా నైపుణ్యాన్ని మెరుగుపరిచినట్లైంది. ఇదే పనితనంతో మేము దక్షిణాఫ్రికాలో విజేతలుగా నిలుస్తామని ఆశిస్తున్నా. అంటూ హర్మన్ అభిప్రాయపడింది. ఆస్ట్రేలియా పర్యటనలో నాకు బ్యాటింగ్ అవకాశం రానప్పటికీ ట్రైనింగ్లో ఎక్కువగా పాల్గొన్నాను. ఈ నేర్పుతో దక్షిణాఫ్రికా పర్యటనలో నా ప్రతిభ చూపించేందుకు చక్కని అవకాశం దొరికిందని పేర్కొంది.
అంతేగాక, హర్మన్ ప్రీత్ ప్రస్తుతం చేస్తున్న రైల్వే ఉద్యోగంలో కొనసాగేందుకు విముఖుత చూపిస్తుంది. అదే ఉద్యోగంలో ఇప్పటికే మూడు సంవత్సరాలు పూర్తి చేసిన ఆమె ఇంకో రెండేళ్లు కలిపి ఐదేళ్ల సర్వీసును పూర్తి చేయకుంటే రైల్వే ప్రభుత్వానికి ఐదు సంవత్సరాల జీతం చెల్లించాల్సి ఉంటుంది.
ఈ విషయంపై హర్మన్ తండ్రి తర్జనభర్జనలు పడిన అనంతరం ఆమెకు పంజాబ్ పోలీసు శాఖలో చేరాలని ఉందని ముఖ్యమంత్రిని అభ్యర్థించాడు. పంజాబ్ ముఖ్యమంత్రి అయిన కెప్టెన్ అమరీందర్ సింగ్ దీనికి ఆమోదం తెలుపడంతో హర్మన్ ప్రీత్ కౌర్ పోలీసు శాఖలో చేరనుంది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.