
హైదరాబాద్: మూడు టెస్టు మ్యాచ్ల సిరిస్లో భాగంగా కేప్ టౌన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో కోహ్లీసేన 72 పరుగుల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఈ ఓటమికి తుది జట్టుని ఎంపిక చేసిన సెలక్షన్ కమిటీపై ఇప్పటికే పలువురు బాహాటంగానే తమ స్పందనను తెలియజేశారు.
విదేశీగడ్డపై చక్కటి ట్రాక్ రికార్డు ఉన్న రహానేను కాదని రోహిత్ శర్మకు చోటు కల్పించడంపై విమర్శించిన సంగతి తెలిసిందే. తాజాగా తొలి టెస్టు ఓటమిపై టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ధ్వజమెత్తాడు. ప్రధానంగా బ్యాటింగ్లో టీమిండియా వైఫల్యం చెందడమే ఓటమి కారణమంటూ చెప్పుకొచ్చాడు.
తొలి టెస్టులో బౌలర్లు అద్భుత ప్రదర్శన చేసినప్పటికీ, బ్యాట్స్మెన్ కనీసం పోరాట పటిమ ఇవ్వలేకపోవడంతోనే భారత జట్టు ఓటమి పాలైందని దాదా పేర్కొన్నాడు. పరిస్థితులు మనకు అనుకూలంగా ఉన్నప్పుడు కనీసం 300-350 పరుగులు అయినా స్కోర్ చేయాల్సింది అని ఆయన అభిప్రాయపడ్డాడు.
బ్యాట్స్మెన్ సరైన ప్రదర్శన ఇవ్వలేనప్పుడు పరిస్థితులు క్రమేపీ కఠినంగా మారతాయని అన్నాడు. బౌలర్లు రాణించినా.. బ్యాటింగ్ వైఫల్యం స్పష్టంగా కనబడిందని చెప్పుకొచ్చాడు. ఒకవేళ వచ్చే టెస్టుల్లో భారత మెరవాలంటే కనీసం ప్రతీ ఇన్నింగ్స్లో 300కు పైగా స్కోరు తప్పక చేయాలని సూచించాడు.
రెండో ఇన్నింగ్స్లో గాయం కారణంగా సఫారీ బౌలర్ స్టెయిన జట్టుకు దూరమైనప్పటికీ, సఫారీలు మాత్రం స్టెయిన్ లోటు కనిపించకుండా బౌలింగ్ చేశారని గంగూలీ ప్రశంసించాడు. అయితే ఈ ఓటమితో ఇండియా నిరాశకు గురి కావొద్దని గంగూలీ అన్నాడు. గెలుపు, ఓటములు కేవలం ఆటలో భాగమని... నాకు తెలిసి విరాట్ కోహ్లీ తర్వాతి మ్యాచ్లో మంచి స్కోర్ చేస్తాడని దాదా అన్నాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.