ప్రపంచకప్ ఓటమి అనంతరం టీమిండియా స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా తిరిగి మైదానంలో అడుగుపెట్టనున్నారు. రేపటి నుంచి దక్షిణాఫ్రికాతో ప్రారంభమయ్యే బాక్సింగ్ డే టెస్టుకు సన్నద్ధమవుతున్నారు. అయితే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్ వంటి దేశాల్లో విజయకేతనం ఎగురవేసిన భారత్.. దక్షిణాఫ్రికాలో మాత్రం ఇప్పటికీ టెస్టు సిరీస్ గెలవలేకపోయింది.ఎనిమిది సార్లు సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లిన టీమిండియా అత్యుత్తమ ప్రదర్శన సిరీస్ డ్రా చేయడమే.
ఈ సారి సఫారీ గడ్డపై సుదీర్ఘ ఫార్మాట్లో విజయం సాధించి చరిత్ర సృష్టించాలని రోహిత్ సేన కసితో బరిలోకి దిగుతోంది. అయితే సౌతాఫ్రికాలో రోహిత్ శర్మ తన బ్యాటింగ్ విధానాన్ని మార్చుకోవాలని దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ సూచించాడు. ప్రపంచకప్లో రోహిత్ ఆది నుంచే దూకుడుగా ఆడుతూ సత్తాచాటిన సంగతి తెలిసిందే. 11 మ్యాచ్ల్లో 54.72 సగటుతో 597 పరుగులు చేశాడు. దీనిలో మూడు హాఫ్ సెంచరీలు, ఒక సెంచరీ ఉన్నాయి.

'' టెస్టులకు తగ్గట్టుగా రోహిత్ శర్మ మానసికంగా సన్నద్ధమవ్వాలి. ఇది అతడికి కాస్త సవాలుగానే ఉంటుంది. ఎందుకంటే అతడు వన్డే ఫార్మాట్లో దూకుడుగా ఆడాడు. వన్డేల్లో ఆది నుంచే ప్రత్యర్థి బౌలర్లపై దాడి చేస్తూ ఎక్కువ పరుగులు చేయాలని ప్రయత్నించాడు. పవర్ ప్లేలో తొలి పది ఓవర్లలో అది సాధ్యమవుతుంది''
'' ఇప్పుడు టెస్టుల కోసం రోహిత్ శర్మ తన బ్యాటింగ్ విధానాన్ని మార్చుకోవాల్సి ఉంది. రోజంతా బ్యాటింగ్ చేసేలా తన ఆలోచన ఉండాలి. అతడు ఒక రోజు ఆటలో అజేయంగా ఉంటే 180 లేదా 190 పరుగులతో సాధిస్తాడు. ఇక భారత్ సులువుగా 300కు పైగా పరుగులు చేయగలదు'' అని సునీల్ గవాస్కర్ అన్నాడు.
కాగా, డిసెంబర్ 26 నుంచి దక్షిణాఫ్రికాతో భారత్ రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది. సెంచూరియన్ వేదికగా తొలి టెస్టు జరగనుంది. చివరి టెస్టు కేప్టౌన్లో జనవరి 03న మొదలవుతుంది. అయితే తొలి టెస్టుకు వర్షం ముప్పు పొంచి ఉంది. భారీ వర్షం వల్ల తొలి రోజు ఆట దాదాపుగా తుడిచిపెట్టుకుపోయే అవకాశముంంది. రెండో రోజు కూడా చాలా ఓవర్ల ఆట నష్టం జరగొచ్చు.