లక్నో సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ గొయెంకా కీలక వ్యాఖ్యలు చేశాడు. తమ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ను బహిరంగంగా విమర్శించడాన్ని పరోక్షంగా సమర్థించుకున్నాడు. ఐపీఎల్ 2024లో సన్రైజర్స్ హైదరాబాద్ చేతిలో లక్నో ఘోరపరాజయం చవిచూడటంతో అందరి ముందే కేఎల్ రాహుల్ను సంజీవ్ గోయెంకా అవమానించిన సంగతి తెలిసిందే.
స్టేడియంలో అభిమానులు, కెమెరాల ముందే ఓటమి గురించి రాహుల్పై మండిపడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. సంజీవ్ చేసింది ఘోరమైన తప్పిదం అని భారత మాజీ క్రికెటర్లు సైతం స్పందించారు. ఓటమిపై సీరియస్ అవ్వాలంటే రూమ్లో చేయాలి కానీ, పబ్లిక్లో ఏంటని ప్రశ్నించారు. ఆ తర్వాత రాహుల్ను సంజీవ్ తన ఇంటికి ఆహ్వానించి బుజ్జగించడంతో ఈ వివాదం సద్దుమణిగింది.

కాగా, తాజాగా సంజీవ్ గొయెంకా మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశాడు. 2017లో అప్పటి తమ రైజింగ్ పుణె సూపర్జెయింట్ ఓటమి గురించి మాట్లాడాడు. ఎంఎస్ ధోనీ, స్టీవ్ స్మిత్ వంటి దిగ్గజాలు తమ జట్టులో ఉన్నప్పటికీ ఓడటానికి గల కారణాలను వివరించాడు. ''ఇవాళ సరిగా ఆడలేకపోయామని ఒక సారి చెప్పి, ఆ తర్వాత రెండు రోజుల తర్వాత కూడా అదే సమాధానం చెబితే నేను అంగీకరించలేను. కాబట్టి ఎందుకు అని అడుగుతాను''
''ఓ ప్లేయర్ ఫామ్లో లేడంటే ఓకే, కానీ 11 మంది ఫామ్లో లేరంటే ఎలా? ఇక మెంటార్గా జహీర్ ఖాన్ పాత్ర.. నిర్ణయాలు తీసుకోవడం. గత సీజన్లో గంభీర్ లేని లోటు కనిపిచింది. వచ్చే సీజన్లో జహీర్ ఆ పాత్రను సమర్థవంతంగా చేస్తాడని భావిస్తున్నా. ఇక ఐపీఎల్లో సూపర్ జెయింట్స్ ఫ్యామిలీ అయిదేళ్లు అయ్యింది. పుణెతో రెండేళ్లు, లక్నోతో మూడేళ్లు. పుణె ఫైనల్కు వెళ్లిన సమయంలో అది కొత్త టీమ్, అనుభవం లేని జట్టు''
''ఎంఎస్ ధోనీ, స్టీవ్ స్మిత్ మినహా జట్టులో మిగిలిన వాళ్ల యువకులు. ఫైనల్లో గెలవాల్సింది. కానీ అనుభవం లేమి జట్టుతో ఓటమిపాలయ్యాం. కాబట్టి కీలక సమయాల్లో సరైన నిర్ణయాలు తీసుకోవడం ఎంతో ముఖ్యమైనది'' అని సంజీవ్ గొయెంకా పేర్కొన్నాడు. ఇటీవల జహీర్ ఖాన్ను మెంటార్గా లక్నో నియమించుకున్న విషయం తెలిసిందే. అయితే 2017 ఫైనల్ జట్టులో ధోనీ, స్మిత్తో పాటు అజింక్య రహానె, మనోజ్ తివారి, డానియల్ క్రిస్టయిన్, జయదేవ్ ఉనద్కత్ వంటి సీనియర్లు కూడా ఉన్నారు.