
ఫీల్డింగ్ తప్పిదాలు..
రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేయడం చాలా కష్టంగా మారింది. పిచ్ పూర్తిగా బౌలింగ్కు సహకరించడం మొదలు పెట్టింది. అయితే బౌలర్లు సృష్టించిన అవకాశాలను భారత ఫీల్డర్లు క్యాష్ చేసుకోలేకపోయారు. కీలకమైన కొన్ని క్యాచులు జారవిడిచారు. ఇలా తనకు వచ్చిన అవకాశాలను చక్కగా ఉపయోగించుకున్న లిటాన్ దాస్ 73 పరుగులు చేసి జట్టుకు మంచి స్కోరు అందించాడు. దీంతో బంగ్లా జట్టు 231 పరుగులు చేసింది. దీంతో భారత్ ముందు 145 పరుగుల టార్గెట్ నిలిపింది. ఈ టార్గెట్ చిన్నదే అయినా పిచ్ నుంచి బౌలర్లకు పూర్తి సహకారం లభిస్తుండటంతో బ్యాటింగ్ చాలా కష్టంగా మారింది.

కుప్పకూలిన బ్యాటింగ్
స్వల్ప లక్ష్య ఛేదనలో భారత్కు ఆరంభంలోనే గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఫామ్ లేక తంటాలు పడుతున్న కెప్టెన్ కేఎల్ రాహుల్ (2) మరోసారి విఫలమయ్యాడు. ఆ తర్వాత కాసేపటికే పుజారా (6) కూడా పెవిలియన్ చేరాడు. అప్పటికే ఆట చివరి దశకు చేరడంతో నైట్ వాచ్మన్గా అక్షర్ పటేల్ (34)ను పంపారు. అయితే మరో ఎండ్లో ఉన్న శుభ్మన్ గిల్ (7) కూడా అవుటవడంతో కోహ్లీ క్రీజులోకి వచ్చాడు. అతను కూడా కేవలం ఒక్క పరుగే చేసి పెవిలియన్ చేరాడు. దీంతో జయదేవ్ ఉనద్కత్ (13) వచ్చాడు. ఉనద్కత్, అక్షర్ పటేల్ ఇద్దరూ మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడ్డారు.

చివరి రోజు టెన్షన్ టెన్షన్
నాలుగో రోజు ఆట మొదలైన కాసేపటికే ఉనద్కత్ కూడా అవుటయ్యాడు. అయితే అక్షర్ పటేల్ కొంత ధాటిగా ఆడాడు. అతనికి జత కలిసిన పంత్ కూడా రాణిస్తాడని అంతా అనుకున్నారు. కానీ అతను 9 పరుగులకే పెవిలియన్ చేరడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. అక్షర్, పంత్ ఇద్దరూ అవుటైన తర్వాత అశ్విన్, శ్రేయాస్ అయ్యర్ క్రీజులోకి వచ్చారు. వీళ్లిద్దరూ చాలా జాగ్రత్తగా ఆడుతూ ఇన్నింగ్స్ను ముందుకు తీసుకెళ్లారు. అయ్యర్ (29 నాటౌట్) తనదైన స్టైల్లో వేగంగా ఆడుతూ లక్ష్యాన్ని కరిగించాడు. చివర్లో గేరు మార్చిన అశ్విన్ (42 నాటౌట్) టీ20 తరహా ఆటతో ఛేజింగ్ పూర్తి చేశాడు.

మరీ ఎక్కువ వికెట్లు కోల్పోయాం..
ఈ ఛేజ్లో తాము అనుకున్న దాని కంటే ఎక్కువ వికెట్లు కోల్పోయామని టీమిండియా కెప్టెన్ కేఎల్ రాహుల్ అన్నాడు. అయితే తను మాత్రం బ్యాటర్లను బలంగా నమ్మానని చెప్పాడు. అశ్విన్, అయ్యర్ ఇద్దరూ జట్టును విజయతీరాలకు చేర్చారన్నాడు. ఈ ఛేజ్ సులభంగా పూర్తవుతుందని తాము అనుకోలేదని, కొత్త బంతిని ఎదుర్కోవడం కష్టంగా కనిపిచిందని వివరించాడు.
అయితే తమ జట్టు మరీ ఎక్కువ వికెట్లు కోల్పోయిందన్నాడు. తమ జట్టు కొన్ని పొరపాట్లు చేసిందని, భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఆ పొరపాట్లు మళ్లీ రిపీట్ కాకుండా చూసుకుంటామని రాహుల్ చెప్పాడు. అశ్విన్, అయ్యర్ కలిసి 71 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పడంతో టీమిండియా మూడు వికెట్ల తేడాతో రెండో టెస్టులో నెగ్గింది. ఈ విజయంతో టెస్టు సిరీస్ను 2-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది.


Click it and Unblock the Notifications












