
ఠాకూర్ అద్భుతం:
కటక్ వన్డే అనంతరం కోహ్లీ మీడియా సమావేశంలో మాట్లాడుతూ... 'నేను ఔట్ అయిన అనంతరం కొంచెం ఆందోళన చెందా. అయితే మైదానం నుండి బయటకు వెళ్ళేటప్పుడు రవీంద్ర జడేజాను చూస్తే.. విజయంపై చాలా ధీమాగా ఉన్నట్టు కనిపించాడు. ఒక చిన్న భాగస్వామ్యం నెలకొల్పితే విజయం ఖాయం అనుకున్నా. శార్దూల్ ఠాకూర్ అద్భుతంగా ఆడాడు. శార్దూల్ ఆడుతుంటే ఆనందం పట్టలేకపోయా. వారిద్దరి ఫినిషింగ్ చాలా బాగుంది' అని అన్నారు.

ఉత్తమ ఏడాది:
'ప్రపంచకప్లో ఆ 30 నిమిషాలు మినహాయిస్తే భారత క్రికెట్లో 2019 ఉత్తమ ఏడాదిగా నిలుస్తుంది. ప్రపంచకప్పై మా దృష్టి ఉంది. దాన్ని అందుకోవడానికి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటాం. ప్రస్తుతం టీమిండియాకు పేస్దళం అద్భుతంగా ఉంది. ఎంతో మంది పేసర్లు భారత్కు ఉన్నారు. ఇది భారత క్రికెట్కు శుభసూచకం' అని కోహ్లీ పేర్కొన్నారు.

వారి వల్లే విజయాలు సాధించాం:
'ఇటీవలి కాలంలో భారత స్పిన్నర్ల కంటే పేసర్ల గురించి ఎక్కువగా మాట్లాడుకోవడం ఎంతో గొప్ప పరిణామం. విదేశాల్లో సిరీస్లు గెలవడంలో పేసర్లది కీలకపాత్ర. వారు రాణించడం వల్లే విజయాలు సాధించాం. యువ ఆటగాళ్లు ఒత్తిడిలో ఎలా రాణిస్తున్నారనే అంశాన్ని పరీక్షిస్తున్నాం. వారికి వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి' అని చెప్పుకొచ్చారు.

భారత్ విజయం:
ఆదివారం వెస్టిండీస్తో జరిగిన మూడో వన్డేలో భారత్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ 5 వికెట్ల నష్టానికి 315 పరుగులు చేసింది. పూరన్ (89), పొలార్డ్ (74) హాఫ్ సెంచరీలతో రాణించారు. సైనీ రెండు వికెట్లు తీసాడు. లక్ష్య ఛేదనలో భారత్ 6 వికెట్లు కోల్పోయి 48.2 ఓవర్లలో విజయాన్ని అందుకుంది. విరాట్ కోహ్లీ (85), కేఎల్ రాహుల్ (77), రోహిత్ శర్మ (63) అర్ధ శతకాలతో రాణించారు. జడేజా (39*), శార్దూల్ ఠాకూర్ (17*) కీలక పాత్ర పోషించారు.

కలిస్ను అధిగమించిన కోహ్లీ:
అద్భుత ఇన్నింగ్స్ ఆడిన కోహ్లీ (81 బంతుల్లో 85; 9 ఫోర్లు) 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'కు ఎంపికయ్యాడు. ఈ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కోహ్లీకి 57వది. దీంతో అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్లు అందుకున్న క్రికెటర్ల జాబితాలో దక్షిణాఫ్రికా దిగ్గజం జాక్వస్ కలిస్ (57)తో సమంగా నిలిచాడు. అంతేకాదు వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో కలిస్ (11,579)ను అధిగమించాడు. కోహ్లీ 11,609 పరుగులతో ఏడో స్థానానికి చేరుకున్నాడు.


Click it and Unblock the Notifications












