హైదరాబాద్: తొలి వన్డేలో హార్ధిక్ పాండ్యా, ధోనిల వల్లే తాము ఓడామని ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ తెలిపాడు. చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా అద్భుత ప్రదర్శన చేసింది. వర్షం అడ్డంకి మారిన ఈ మ్యాచ్లో భారత్ డక్వర్త్ లూయిస్ పద్ధతిలో 26 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాపై విజయం సాధించిన సంగతి తెలిసిందే.
ఈ విజయంతో ఐదు వన్డేల సిరిస్లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. అయితే, తొలి వన్డేలో ఓటమి అనంతరం ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ మీడియాతో మాట్లాడాడు. 'కొత్త బంతితో మేం బాగా బౌలింగ్ చేశాం. కానీ భారత ఆటగాళ్లను నియంత్రించలేకపోయాం. ధోని, పాండ్యా బాగా ఆడారు. మ్యాచ్లో స్వరూపాన్ని మార్చింది వారిద్దరే' అని స్మిత్ పేర్కొన్నాడు.

అంతేకాదు ఈ మ్యాచ్లో మంచి ఆరంభం దొరికినా దానిని సద్వినియోగం చేసుకోలేకపోయామని స్మిత్ అన్నాడు. తొలి ఇన్నింగ్స్ పూర్తి అయిన తర్వాత వర్షం అడ్డంకిగా మారడం కూడా మ్యాచ్పై ప్రభావం చూపిందని స్టీవ్ స్మిత్ అభిప్రాయపడ్డాడు. 'మిడిలార్డర్లో మేం త్వరగా వికెట్లు కోల్పోయాం. అయినా వాతావరణాన్ని మేం నియంత్రించలేం. కాబట్టి ఎలాంటి ఫిర్యాదులు లేవు' అని అన్నాడు.
కాగా, కోహ్లీసేన మాకంటే మెరుగ్గా ఆడిందని, భారత బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారని స్మిత్ పేర్కొన్నాడు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా హార్దిక్ పాండ్యా (66 బంతుల్లో 83; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), ధోని (88 బంతుల్లో 79; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 281 పరుగులు చేసింది.
వర్షం అడ్డంకిగా మారడంతో ఆసీస్ లక్ష్యాన్ని 21 ఓవర్లలో 164 పరుగులుగా నిర్ధారించారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 137 పరుగులు చేసింది. ఆల్రౌండ్ ప్రదర్శన చేసిన పాండ్య 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్'గా ఎంపికయ్యాడు. రెండో వన్డే గురువారం (సెప్టెంబర్ 21) కోల్కతాలో జరుగుతుంది.