భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లిని పాకిస్థాన్ క్రికెటర్ మహ్మద్ రిజ్వాన్ కొనియాడాడు. కోహ్లి గొప్ప ప్లేయర్ అని, అతని ఆటను చూసి తమ జట్టు ఆటగాళ్లు ఎంతో నేర్చుకుంటున్నామని అన్నాడు. నెదర్లాండ్స్తో జరిగిన రెండో టీ20లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న అనంతరం రిజ్వాన్ ఈ వ్యాఖ్యలు చేశాడు.
ఐర్లాండ్ పర్యటనను ఓటమితో ప్రారంభించిన పాకిస్థాన్ ఎట్టకేలకు విజయాన్ని సాధించింది. ఆదివారం జరిగిన రెండో టీ20లో ఐర్లాండ్పై పాకిస్థాన్ ఏడు వికెట్ల తేడాతో నెగ్గింది. సిరీస్ను 1-1తో సమం చేసింది. మహ్మద్ రిజ్వాన్(46 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్లతో 75 నాటౌట్), ఫకార్ జమాన్(40 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్లతో 78) విజయంలో కీలకపాత్ర పోషించారు.

మొదట బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 193 పరుగులు చేసింది. లోర్కన్ టెక్టర్(34 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్లతో 51) హాఫ్ సెంచరీ సాధించాడు. గరెత్ డెలనీ(10 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 28 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన పాకిస్థాన్ 16.5 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది.
కాగా, 2020 నుంచి రిజ్వాన్ టీ20ల్లో సత్తాచాటుతున్నాడు. 79 మ్యాచ్ల్లో 57 సగటుతో 2944 పరుగులు చేశాడు. పొట్టి ఫార్మాట్లో కనీసం 1000+ పరుగులు సాధించిన ఆటగాళ్లలో 50+ సగటు సాధించిన ఆటగాళ్లు కేవలం ఇద్దరే. విరాట్ కోహ్లితో పాటు రిజ్వాన్ ఈ ఘనత అందుకున్నాడు. ఈ నేపథ్యంలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న అనంతరం రిజ్వాన్ మాట్లాడాడు.

''నంబర్ల గురించి ఆలోంచిచను. ఏవరేజ్ గురించి పట్టించుకుంటే మనం ఏవరేజ్ ప్లేయర్గానే ఉంటాం. మ్యాచ్ గురించి, పరిస్థితుల గురించి ఆలోచిస్తే ఉత్తమంగా ఉంటుంది. ఇక విరాట్ కోహ్లి గురించి చెప్పాలంటే... అతను మంచి ప్లేయర్. అతని నుంచి మేం ఎంతో నేర్చుకున్నాం. అతని పట్ల నాకెంతో గౌరవం ఉంది'' అని రిజ్వాన్ అన్నాడు.