లండన్: ప్రపంచకప్ టోర్నమెంట్లో ఆప్ఘనిస్తాన్పై స్ఫూర్తిదాయకమైన విజయాన్ని అందుకుంది బంగ్లాదేశ్. ఇక ఆ జట్టు తన తదుపరి మ్యాచ్లో టీమిండియాను ఢీకొనబోతోంది. వచ్చేనెల 2వ తేదీన బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్ స్టేడియంలో భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు ఈ మ్యాచ్ ఆరంభం కానుంది. బలమైన భారత లైనప్ ఉన్న టీమిండియాను ఎదుర్కొనడానికి ఇప్పటి నుంచే సన్నాహాలు మొదలు పెట్టింది బంగ్లాదేశ్. దీనికోసం ముమ్మరంగా నెట్ ప్రాక్టీస్ చేస్తోంది. వైవిధ్యమైన బంతులను ఎదుర్కొంటున్నారు బంగ్లాదేశ్ బ్యాట్స్మెన్లు. దీనికితోడు- బౌలింగ్లోనూ ప్రయోగాలు చేస్తున్నారు.
సంఖ్య చూసి..గుడ్లు తేలేసిన ఐసీసీ: భారత్- పాక్ మ్యాచ్ను ఎంతమంది చూశారో తెలుసా?
భారత బ్యాట్స్మెన్ల బలహీనతలు తెలుసు..
టీమిండియా బ్యాటింగ్ లైనప్ గురించి తమకు పూర్తి అవగాహన ఉందని, వారి బలహీనతలు తెలుసునని బంగ్లాదేశ్ బౌలింగ్ కోచ్ సునీల్ జోషి అన్నారు. దీనికి అనుగుణంగా తాము వ్యూహాలను రూపొందించుకుంటున్నామని చెప్పారు. భారత బ్యాట్స్మెన్లకు ఎక్కడ బంతులు వేయాలి? ఎలా వేయాలి? అనే విషయాలపై పూర్తి అవగాహన ఉందని అన్నారు. వారిని కట్టడి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. వచ్చేనెల 2వ తేదీన భారత్తో మ్యాచ్ కోసం తమ జట్టు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని చెప్పారు. ఎడ్జ్బాస్టన్ స్టేడియం స్పిన్నర్లకు స్వర్గధామం అయినందున రెండు దేశాలు కూడా ఈ వ్యూహంతోనే ప్రత్యర్థిని కట్టడి చేస్తాయని తాను భావిస్తున్నట్లు చెప్పారు.
ప్రపంచకప్కు ముందు తాము ఇంగ్లండ్, ఐర్లాండ్లల్లో పర్యటించామని అన్నారు. ఐర్లాండ్ను ఓడించామని గుర్తు చేశారు. తెల్ల బంతితో స్పిన్లో ఎలాంటి ప్రయోగాలు చేయాలో తమకు తెలుసని చెప్పారు. భారత్తో మ్యాచ్ సందర్భంగా షకీబుల్ హసన్ మరోసారి అద్భుతంగా రాణిస్తాడని అంచనా వేస్తున్నామని అన్నారు. టీమిండియా తరఫున అనేక మ్యాచ్లను ఆడిన ఆఫ్ బ్రేక్ స్పిన్నర్ సునీల్ జోషి. 15 టెస్టు మ్యాచులు, 69 వన్డే మ్యాచ్లను ఆయన టీమిండియా తరఫున ఆడారు. దక్షిణాఫ్రికాపై అత్యుత్తమ గణాంకాలను నమోదు చేశారు. కేవలం ఆరు పరుగులను ఇచ్చి అయిదు వికెట్లను పడగొట్టిన ఘనత సునీల్ జోషికి ఉంది. ఇప్పటిదాకా- ఆ రికార్డును ఏ స్పిన్నర్ కూడా చెరిపేయలేదు.