|
ఆర్ధిక కారణాల వల్ల
"ఐపీఎల్ రూల్స్ ప్రకారం వేలంలో అతడిని కొనుగోలు చేసిన మొత్తాన్ని చెల్లించలేకపోయాం. దీంతో మేనేజ్మెంట్ అంగీకారంతో శిఖర్ ధావన్ను బదిలీ చేయాలని నిర్ణయం తీసుకున్నాం. ఇందుకు ఇరు పార్టీలు అంగీకరించాయి. గత కొన్నేళ్లుగా సన్రైజర్స్ వాల్యూ పెంచేందుకు ధావన్ ఎంతో కృషి చేసాడు. ఆర్ధిక కారణాల వల్లే అతడు మరో జట్టుకు బదిలీ అవుతున్నాడు. ఆల్ ద బెస్ట్" అని సన్రైజర్స్ హైదరాబాద్ తన ట్విట్టర్ లో ప్రెస్నోట్ రూపంలో అధికారిక ప్రకటన చేసింది.
2019లో ఢిల్లీ డేర్డెవిల్స్కు ఆడనున్న శిఖర్ ధావన్
దీంతో, టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ వచ్చే ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఢిల్లీ డేర్డెవిల్స్కు ఆడటం ఖాయమైంది. పదకొండేళ్ల తర్వాత అతడు ఢిల్లీకి ఆడుతుండటం విశేషం. గతేడాది వేలంలో ఆర్టీఎం విధానంలో ధావన్ను రూ.5.2 కోట్లకు సన్రైజర్స్ తీసుకుంది. ఎక్కువ ధరకు తనను రిటైన్ చేసుకోలేదని గబ్బర్ సన్రైజర్స్ కోచ్తో వాగ్వాదానికి దిగినట్టు ఇటీవల వార్తలు వచ్చాయి.
ట్రేడాఫ్ విధానంలో ధావన్ను కొనుగోలు చేసిన ఢిల్లీ
ఈ నేపథ్యంలో అతడిని ట్రేడాఫ్ విధానంలో తీసుకొనేందుకు ముంబై ఇండియన్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఆసక్తి చూపించాయి. వేలం ద్వారా కొనుగోలు చేసేందుకు పంజాబ్ అమితాసక్తి చూపించింది. కానీ, ఎట్టకేలకు అతడిని ఢిల్లీ డేర్ డెవిల్స్ దక్కించుకుంది. శిఖర్ ధావన్కు బదులుగా ఢిల్లీ నుంచి షాబాజ్ నదీమ్, విజయ్ శంకర్, అభిషేక్ వర్మను సన్రైజర్స్ హైదరాబాద్ తీసుకుంది.
వ్యూహాత్మకంగా అడుగులు వేసిన సన్రైజర్స్
ఈ విషయంలో సన్రైజర్స్ వ్యూహాత్మకంగా అడుగులు వేసిందని క్రికెట్ విశ్లేషకుల అభిప్రాయం. దేశవాళీ క్రికెట్లో మంచి పేరున్న నదీమ్ (రూ.3.2 కోట్లు)ను భారత స్పిన్నర్ కోటాలో వినియోగించుకోనుంది. ఇక ఏడాది అంతరం తర్వాత విజయ్ శంకర్ (రూ.3.2 కోట్లు) తిరిగి హైదరాబాద్కు వస్తున్నాడు. విజయ్ శంకర్ ఆల్రౌండ్ కావడం విశేషం. యువ అభిషేక్ వర్మ (రూ.55 లక్షలు) మిడిలార్డర్లో ఉపయోగపడతాడు. ఈ ముగ్గురికి ఇవ్వాల్సిన మొత్తం రూ.6.95 కోట్లు. ధావన్ విలువ రూ.5.2 కోట్లు. దీంతో మిగిలిన డబ్బును ఢిల్లీ డేర్డెవిల్స్కు హైదరాబాద్ చెల్లించనుంది.