
హైదరాబాద్: మిడిలార్డర్లో టీమిండియా యువ ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ సేవల్ని వినియోగించుకోవడంలో టీమిండియా మేనేజ్మెంట్ విఫలం అవుతుందని అనిల్ కుంబ్లే వ్యాఖ్యానించాడు. శ్రేయాస్ అయ్యర్ బ్యాటింగ్ ఆర్డర్ను పదే పదే మార్చడాన్ని అనిల్ కుంబ్లే తప్పుబట్టాడు.
ఇటీవలే వెస్టిండిస్తో ముగిసిన మూడు టీ20ల సిరిస్లో శ్రేయాస్ అయ్యర్ను జట్టు మేనేజ్మెంట్ ఐదు, ఆరు స్థానాల్లో బరిలోకి దించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నైపుణ్యం కలిగిన ఆటగాడైన అయ్యర్కు నాలుగో స్థానమే సరైందని అనిల్ కుంబ్లే అభిప్రాయపడ్డాడు.
తాజాగా స్టార్ స్పోర్ట్స్కు ఇచ్చిన ఇంటర్యూలో అనిల్ కుంబ్లే మాట్లాడుతూ "శిఖర్ ధావన్ జట్టులో లేని కారణంగా కేఎల్ రాహుల్కు మళ్లీ ఓపెనింగ్ చాన్స్ చేసే అవకాశం వచ్చింది. దాంతో అయ్యర్ను నాలుగో స్థానంలో బ్యాటింగ్కు పంపడానికి ఆస్కారం ఉంటుంది" అని అన్నాడు.
"అయ్యర్ ఆటను చూస్తూనే ఉన్నాం. నిలకడగా ఆడుతున్నాడు. అతన్ని మళ్లీ నాలుగో స్థానంలో చూడాలనుకుంటున్నా" అని కుంబ్లే తెలిపాడు. ఆదివారం ప్రారంభయ్యే వన్డే సిరిస్లో వెస్టిండిస్ జట్టు టీమిండియాకు సవాల్ విసురుతుందని కుంబ్లే చెప్పుకొచ్చాడు.
విండీస్ జట్టులో పవర్ఫుల్ హిట్టర్లు ఉన్నారని, దాంతో భారత జట్టు బౌలింగ్ లైనప్లో మరింత పదును పెరగాలని కుంబ్లే సూచించాడు. ఇటీవలే వెస్టిండిస్తో ముగిసిన మూడు టీ20ల సిరిస్లో టీమిండియా 2-1తో సిరిస్ కైవసం చేసుకుంది. ఈ సిరిస్లో భాగంగా హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి టీ20లో ఐదో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన అయ్యర్ నాలుగు పరుగులు చేసి ఔటయ్యాడు.
ఇక, తిరువనంతపురం వేదికగా జరిగిన రెండో టీ20లో ఆరో స్థానంలో బ్యాటింగ్కు దిగిన అయ్యర్ కేవలం 10 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్కు చేరాడు. ఆఖరి టీ20లో అయ్యర్ ఇంకా రెండు బంతులు మాత్రమే ఉండగా ఐదో స్థానంలో బ్యాటింగ్కు రావడంతో స్టైకింగ్ చేసే అవకాశం లభించలేదు. కాగా, ఇరు జట్ల మధ్య తొలి వన్డే చెన్నై వేదికగా ఆదివారం జరగనుంది.