
బ్రిస్బేన్: టీ20 ప్రపంచకప్ 2022లో ఇవ్వాళ సూపర్ సండే. మొత్తంగా మూడు మ్యాచ్లు షెడ్యూల్ అయ్యాయి. తొలి మ్యాచ్ ఈ ఉదయం 8:30 గంటలకు మొదలవుతుంది. బ్రిస్బేన్లోని గబ్బా స్టేడియంలో జింబాబ్వే - బంగ్లాదేశ్ మధ్య పోరు ఉంటుంది. టీ20 ప్రపంచకప్ టైటిల్ హాట్ ఫేవరెట్లల్లో ఒకటైన పాకిస్తాన్ను ఓడించిన ఊపు మీద ఉంది జింబాబ్వే. సెమీ ఫైనల్స్ చేరుకుంటామంటూ హెడ్ కోచ్ ధీమా వ్యక్తం చేస్తోన్న నేపథ్యంలో బంగ్లాదేశ్ను ఎలా ఎదుర్కొంటుందనేది ఆసక్తిగా మారింది.
ఈ మ్యాచ్కు ముందు బ్రిస్బేన్ గబ్బా స్టేడియంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జింబాబ్వే కేప్టెన్ క్రెయిగ్ ఇర్విన్ మాట్లాడాడు. పాకిస్తాన్పై ఫైనల్ ఓవర్ థ్రిల్లర్లో సాధించిన విజయం జట్టులో ఆత్మవిశ్వాసాన్ని నింపిందని వ్యాఖ్యానించాడు. ఈ మెగా టోర్నమెంట్ సెమీ ఫైనల్స్కు చేరుతామనే ధీమాను కలిగించిందని చెప్పాడు. తాము సెమీ ఫైనల్స్కు చేరడానికి అధిక అవకాశాలు ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకుంటామని ఇర్విన్ పేర్కొన్నాడు.
టీ20 ప్రపంచకప్ వంటి ప్లాట్ఫామ్పై పాకిస్తాన్ జట్టును ఓడించడాన్ని ఓ అద్భుతంగా అభివర్ణించాడు ఇర్విన్. తమ కంటే ఎంతో బలమైన పాకిస్తాన్పై గొప్ప విజయాన్ని సాధించామని వ్యాఖ్యానించాడు. ఈ గెలుపుతో తాము సెమీ ఫైనల్స్ చేరే అవకాశాలు మరింత మెరుగుపడ్డాయని అన్నాడు. తమ తదుపరి మ్యాచ్లో ఆడబోయే బంగ్లాదేశ్ను తక్కువగా అంచనా వేయట్లేదని, ఆ జట్టును ఓడించడానికి అవసరమైన అస్త్రశస్త్రాలు సిద్ధంగా ఉన్నాయని చెప్పాడు.
ఈ నెల 27వ తేదీన పాకిస్తాన్పై జరిగిన మ్యాచ్లో జింబాబ్వే ఘన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 130 పరుగులు చేయగా.. బాబర్ ఆజమ్ టీమ్- దాన్ని ఛేదించలేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లల్లో ఎనిమిది వికెట్ల నష్టానికి 129 పరుగులు చేయగలిగింది. ఒక్క పరుగు తేడాతో ఓడింది.
టీ20 ప్రపంచకప్ సూపర్ 12 గ్రూప్ 2 పాయింట్ల పట్టికలో జింబాబ్వే స్థానం మెరుగ్గా ఉంది. ప్రస్తుతం మూడో స్థానంలో ఉందా టీమ్. భారత్, దక్షిణాఫ్రికా తరువాతి పొజీషన్ జింబాబ్వేదే. ఇప్పటివరకు జింబాబ్వే రెండు మ్యాచ్లను ఆడింది. అందులో ఒకటి వర్షం వల్ల ఫలితం తేలలేదు. దీనితో ఒక పాయింట్ను సొంతం చేసుకుంది. తన తరువాతి మ్యాచ్లో పాకిస్తాన్ను మట్టి కరిపించింది. రెండు పాయింట్లను తన ఖాతాలో వేసుకుంది. మూడు పాయింట్లతో పాటు 0.050 నెట్ రన్రేట్ను అందుకుంది.