కోచ్ స్టువర్ట్ లా శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ
ఈ నేపథ్యంలో ఆ జట్టు కోచ్ స్టువర్ట్ లా శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ "జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్లను మళ్లీ భారత జట్టులోకి ఎంపిక చేయడానికి కారణం సిరీస్లో వెస్టిండీస్ జట్టు బాగా ఆడుతుండటమేనని నాకు అనిపిస్తోంది. తొలి రెండు వన్డేలకి విశ్రాంతినిచ్చిన వారిని మళ్లీ ఎందుకు పిలిపిస్తున్నట్లు? వన్డేల్లో అనుభవం ఉన్న బుమ్రా, భువీలను మళ్లీ రప్పించిన ఘనత విండీస్కే చెందుతుంది" అని అన్నాడు.
రెండో వన్డేలో కోహ్లీ సెంచరీ
విశాఖ వేదికగా గత బుధవారం జరిగిన రెండో వన్డేలో విరాట్ కోహ్లీ (157 నాటౌట్) అజేయ సెంచరీతో రాణించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 321 పరుగులు చేయగా.. అనంతరం లక్ష్య ఛేదనలో హోప్ (123 నాటౌట్) సెంచరీ రాణించడంతో వెస్టిండీస్ కూడా సరిగ్గా 50 ఓవర్లలో 321/7తో నిలిచింది.
చివరి మూడు వన్డేలకు భువీ, బుమ్రా
దీంతో మ్యాచ్ టైగా ముగిసింది. ఈ క్రమంలో చివరి మూడు వన్డేల కోసం గురువారం 15 మందితో కూడిన జట్టుని ప్రకటించిన సెలక్టర్లు షమీపై వేటు వేసి బుమ్రా, భువీలని మళ్లీ జట్టులోకి ఎంపిక చేశారు. తొలి రెండు వన్డేలకి బుమ్రా, భువీలకు విశ్రాంతినిచ్చిన సెలక్టర్లు వారి స్థానంలో ఉమేశ్ యాదవ్, మహ్మద్ షమీలను ఎంపిక చేశారు. మొదటి రెండు వన్డేల్లోనూ వీరు చెప్పుకోదగ్గ స్థాయిలో రాణించలేకపోయారు.
భారత్ జట్టు:
భారత్ జట్టు: విరాట్ కోహ్లి (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, అంబటి రాయుడు, రిషబ్ పంత్, మహేంద్రసింగ్ ధోని (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, చాహల్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, ఖలీల్ అహ్మద్, ఉమేశ్ యాదవ్, కేఎల్ రాహుల్, మనీశ్ పాండే