
హైదరాబాద్: రెండో టీ20లో సఫారీలు విజయానికి పూర్తిగా అర్హులని, అయితే సఫారీల విజయాన్ని తాము ముందుగానే ఊహించామని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు. సెంచూరియన్ వేదికగా ఆతిథ్య దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో కోహ్లీసేన 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే.
మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ మాట్లాడుతూ 'విజయానికి సఫారీలు అర్హులు. రెండో టీ20లో దక్షిణాఫ్రికా నుంచి తీవ్ర ప్రతిఘటన ఉంటుందని ముందే అనుకున్నాం. అలానే సఫారీలు చెలరేగి ఆడారు. క్లాసన్, డుమినీలు మ్యాచ్ను మా వైపు నుంచి లాగేసుకున్నారు. ఈ మ్యాచ్లో బౌలర్లకు క్లిష్ట పరిస్థితి ఎదురైంది' అని కోహ్లీ పేర్కొన్నాడు.
'మేము ఆదిలోనే కీలక వికెట్లను నష్టపోవడంతో 175 పరుగులపై దృష్టి సారించాం. అయితే మనీష్ పాండే, రైనా, ధోనిలు దూకుడుగా ఆడటంతో దాదాపు 190 పరుగుల వరకూ చేయగలిగాం. నిజానికి ఈ పరుగులు మ్యాచ్ గెలిపించేవే. అయితే, క్లాసన్ చెలరేగి ఆడుతుండటంతో ఏమీ చేయలేకపోయాం' అని అన్నాడు.
'12వ ఓవర్ నుంచి మ్యాచ్ని మా చేతుల్లో నుంచి లాగేసుకున్నాడు. ఈ క్రెడిట్ అంతా దక్షిణాఫ్రికా బ్యాట్స్మెన్దే. ఈ ఓటమి ప్రభావం తదుపరి మ్యాచ్పై ఎంతమాత్రం ఉండదు. మేము బాగా ఆడాం. కానీ బౌలింగ్లో విఫలం కావడంతో ఓటమి చూడాల్సి వచ్చింది. ఆఖరి టీ20లో గెలిచి సిరీస్ను సాధించడంపైనే మా దృష్టి' అని కోహ్లీ తెలిపాడు.
రెండో టీ20లో క్లాసన్ (69) చెలరేగడంతో రెండో టీ20లో భారత్ ఓటమి పాలైంది. అంతకముందు బ్యాటింగ్ చేసిన భారత్ మనీష్ పాండే (79 నాటౌట్), ధోని (52 నాటౌట్) రాణించడంతో 4 వికెట్లకు 188 పరుగులు సాధించింది. అనంతరం లక్ష్య చేధనకు దిగిన సఫారీలు 18.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. చివరిదైన మూడో టీ20 శనివారం కేప్టౌన్ వేదికగా జరగనుంది.