2023 వన్డే వరల్డ్ కప్ ఆద్యంతం విజయాలతో హోరెత్తించిన భారత్ తుదిమెట్టుపై బోల్తాపడింది. ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లో ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. అయితే వన్డే మెగా సమరంలో ఓటమి బాధను దిగమింగి, కొన్ని నెలల్లోనే టీ20 వరల్డ్ కప్ కోసం రోహిత్ సేన రెట్టింపు కసితో బరిలోకి దిగింది. టీ20 ఫార్మాట్లో టీమిండియా విశ్వవిజేతగా నిలిచింది.
అయితే వన్డే వరల్డ్ కప్, టీ20 వరల్డ్ కప్కు చేసిన ప్రణాళికల గురించి రాహుల్ ద్రవిడ్ మాట్లాడాడు. భిన్నంగా ఏదీ ప్రయత్నించలేదని, సింపుల్ ప్లాన్తో బరిలోకి దిగామని వివరించాడు. సియెట్ అవార్డుల ప్రదానోత్సవంలో జీవితకాల సాఫల్య పురస్కారాన్ని అందుకున్న ద్రవిడ్ ఆసక్తిర వ్యాఖ్యలు చేశాడు. టీ20 వరల్డ్ కప్ అనంతరం ద్రవిడ్ భారత జట్టు కోచ్ బాధ్యతల నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే.

''నిజాయతీగా చెప్పాలంటే.. టీ20 వరల్డ్ కప్ కోసం భిన్నంగా ఏదీ ప్రయత్నించలేదు. వన్డే వరల్డ్ కప్లో మేం అద్భుతంగా ఆడాం. రోహిత్, జట్టు సభ్యులంతా గొప్పగా ఆడారు. ఆ మెగాటోర్నీలో మా ప్రయాణం గొప్పగానే సాగింది. వరుసగా 10 మ్యాచ్ల్లో విజయం సాధించి ఆధిపత్యం చెలాయించాలని, దానికి తగ్గట్లుగా ఆడాలని భావించాం''
''వన్డే వరల్డ్ కప్ ప్లాన్ను పొట్టి కప్లో మార్చాలనుకోలేదు. సహాయక సిబ్బంది, జట్టు సమావేశాల్లోనూ ఉమ్మడి అభిప్రాయమే వెల్లడైంది. ఎలాంటి మార్పులు వద్దు, చేయాలనుకున్నది సరిగ్గా చేద్దాం అని నిర్ణయించుకున్నాం. అదే ఎనర్జీతో, అదే ఉత్సాహంతో ఆడాలనుకున్నాం. ఇక ఆ రోజు కొంచెం అదృష్టం కూడా కలిగి ఉండాలనుకున్నాం'' అని రాహుల్ ద్రవిడ్ పేర్కొన్నాడు. భారత్లో జరిగిన వరల్డ్ కప్లో ఆటగాడిగా భాగస్వామ్యం కాలేకపోయానని, కానీ కోచ్గా పనిచేశానని, ప్రజల నుంచి గొప్ప ప్రేమను పొందానని ద్రవిడ్ అన్నాడు.