హైదరాబాద్: ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు ట్రోఫీతోనే స్వదేశానికి తిరిగి వెళుతుందని ఆ జట్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఆశాభావం వ్యక్తం చేశాడు. దీనిని బట్టి చూస్తుంటే శనివారం రాంచీ వేదికగా ప్రారంభమయ్యే మూడు టీ20ల సిరిస్పై ఆసీస్ కన్నేసినట్లుగా తెలుస్తోంది. టీ20 సిరిస్లో తమ ఆటగాళ్లు స్థాయికి తగ్గట్టుగా ఆడి టైటిల్ను సాధించడంలో సహకరిస్తారనే నమ్మకాన్ని స్మిత్ పెట్టుకున్నాడు.
ఇందుకు తగ్గట్టుగా ఆటగాళ్లు పూర్తి స్థాయి ప్రదర్శనకు సిద్ధం కావాలని ఆటగాళ్లను హెచ్చరించాడు. ఇటీవల నాగపూర్లో జరిగిన ఐదో వన్డే ఓటమి అనంతరం స్మిత్ మీడియాతో మాట్లాడాడు. 1-4తో సిరీస్ను ఓడిపోవడం గత 28 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారి అని స్టీవ్ స్మిత్ పేర్కొన్నాడు.

భారత్ ఆటగాళ్లు ఎంతో చక్కగా ఆడుతున్నారు. ఆ జట్టు పటిష్టంగా ఉంది. ఐదో వన్డే జరిగిన నాగ్పూర్ వికెట్పై మూడొందలకు పైగా పరుగులు చేయొచ్చు. కానీ మా బ్యాట్స్మెన్ పూర్తిగా విఫలమయ్యారు. మా టాపార్డర్ నలుగురిలో కచ్చితంగా ఒకరు భారీ స్కోరు చేసి ఉండాల్సింది. కానీ అలా జరగలేదు. స్వల్ప విరామాల్లో వికెట్లు కోల్పోయాం' అని స్మిత్ తెలిపాడు.
'జట్టులో సమతుకం ఉండాలంటే నిలకడైన ప్రదర్శన అవసరం. వన్డే సిరీస్ను 1-4 తో కోల్పోవడం నిజంగా బాధాకరం'అని స్మిత్ పేర్కొన్నాడు. తమ జట్టులోని ఆటగాళ్లకు భారత్లో ఆడిన అనుభవం చాలా మందికి ఉందనే విషయం ఇక్కడ అంగీకరించాల్సిందేనని స్మిత్ చెప్పాడు. సానుకూల ధోరణితో ఆడితేనే ప్రత్యర్థిపై పైచేయి సాధించే అవకాశం ఉందని తెలిపాడు.