
హైదరాబాద్: ఆఖరి వరకూ ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో విజయం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరునే వరించింది. గురువారం రాత్రి చిన్నస్వామి స్టేడయం వేదికగా జరిగిన సమరంలో ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. చివరి బంతి వరకూ పోరాడిన హైదరాబాద్ 14 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ క్రమంలో ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్కు బెంగళూరు ఇరగదీసి ఆడిందనే చెప్పాలి.
ఈ ఇన్నింగ్స్లో మొయిన్ అలీ కీలక పాత్ర పోషించాడు. అంచనాలకు మించిన ఆటను ప్రదర్శించి డివిలయర్స్కు మంచి భాగస్వామ్యాన్ని అందించాడు. ఏబీ డివిలియర్స్కి జతగా క్రీజులోకి దిగిన మొయిన్ అలీ వరుస సిక్స్లతో జట్టును విజయ తీరాలవైపు నడిపించాడు.
ఈ విజయంపై అలీ మాట్లాడుతూ.. 'ఇప్పుడు మా జట్టు విజయం సాధించడం చాలా అవసరం. మేం ప్లే ఆఫ్ చేరడానికి ఈ విజయం దోహదపడుతుంది. జట్టులోని మిగతా సభ్యులను నేను కోరేది ఒక్కటే. మనం ఎప్పుడూ వారిద్దరి(కోహ్లి, డివిలియర్స్) మీదే ఆధారపడటం మంచిది కాదు. జట్టు విజయం కోసం మనందరం కృషి చేయాలని' సూచించాడు.
ఈ సందర్భంగా మాట్లాడిన మొయిన్ అలీ.. నెట్స్లో చేసిన ప్రాక్టీసు తనకు బాగా కలిసొచ్చిందన్నాడు. తానేమీ చాలా గొప్ప ఆటగాడిగా ఇక్కడకు రాలేదని తెలిపాడు. కానీ ఐపీఎల్లో ఆడిన అనుభవం తనకు ఇకనుంచీ ఆడే వన్డేల్లో బాగా ఉపయోగపడుతుందని హర్షం వ్యక్తం చేశాడు. అదేవిధంగా తనకు శిక్షణ ఇచ్చిన కోచ్లు గ్యారీ, ట్రెంట్లను గుర్తు చేసుకున్నాడు. వారు బ్యాటింగ్ విషయంలో తనకు చాలా సలహాలు ఇచ్చారని, వారి వల్లే తన ఆట తీరు మెరుగుపడిందని వెల్లడించాడు.
గురువారం జరిగిన మ్యాచ్లో అలీ-డివిలియర్స్ 105 పరుగుల భాగస్వామ్యం నమోదు చేయగా, అందులో అలీ 34 బంతుల్లోనే 65 పరుగులు సాధించడం గమనార్హం. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తదుపరి మ్యాచ్ను ఆదివారం రాజస్థాన్ రాయల్స్తో తలపడనుంది.