ఆసియా కప్ 2025 టోర్నమెంట్లో భాగంగా నేడు(సెప్టెంబర్ 24) బంగ్లాదేశ్ జట్టుతో టీమిండియా సూపర్-4 మ్యాచ్ జరగనుంది. దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా ఈ కీలక మ్యాచ్ జరగనుంది. ఇండియా కాలమానం ప్రకారం.. నేడు రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుండగా.. ఇందులో టాస్ గెలిచిన జట్టు మొదట బౌలింగ్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ కీలక మ్యాచ్కు ముందు బంగ్లాదేశ్ కోచ్ ఫిల్ సిమన్స్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. టీమిండియాను ఓడించడం అంత కష్టమేమీ కాదని.. మేము మా బెస్ట్ ఆటతీరును కనబరిస్తే వారిని గెలవగలమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
బంగ్లాదేశ్ కోచ్ ఫిల్ సిమన్స్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ.. భారత్ ప్రపంచంలో నంబర్ వన్ టీ20 జట్టు కావచ్చని.. కానీ మేము గెలవలేమన్నది నిజం కాదన్నారు. ప్రతీ జట్టుకు భారత్ను ఓడించే సామర్థ్యం ఉంటుందన్నారు. మేము మా శక్తి మేరకు ఆడితే తప్పులు రాబట్టి, మ్యాచ్ ను మలుపు తిప్పగలమని వ్యాఖ్యానించారు. ఆ సత్తా బంగ్లాదేశ్ కు ఉందని స్పష్టం చేశారు. 3 గంటల మ్యాచ్ లో ఫలితం ఎప్పుడైనా మారవచ్చని.. అందుకే ఇవాళ బంగ్లాదేశ్ గెలుస్తుందని వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికే శ్రీలంకను ఓడించామని.. టీమిండియాను కూడా ఓడిస్తామని హెచ్చరించారు. తాము ఆసియా కప్ టైటిల్ గెలిచేందుకు వచ్చామని.. బలమైన జట్లను ఢీకొట్టేందుకు సిద్ధంగా ఉన్నామంటూ విశ్వాసం వ్యక్తం చేశారు. బంగ్లా కోచ్ ఫిల్ సిమన్స్ చేసిన సంచలన వ్యాఖ్యలు వైరల్గా మారాయి.

బ్యాక్ టు బ్యాక్ మ్యాచ్లపై కోచ్ ఆవేదన
బంగ్లాదేశ్ జట్టు బుధవారం టీమిండియాతో, తర్వాత రోజు(సెప్టెంబర్ 25) పాకిస్తాన్ జట్టుతో తలపడనుంది. వరుసగా రెండు మ్యాచ్లు ఇవ్వడం అన్యాయమని బంగ్లా కోచ్ ఫిల్ సిమన్స్ అభిప్రాయపడ్డారు. ఇలా బ్యాక్ టు బ్యాక్ మ్యాచ్లు జరగడం వల్ల ఆటగాళ్లపై ఒత్తిడి పెరుగుతుందని.. ఇది ఏ జట్టుకైనా అసమంజసమని ఆయన వ్యాఖ్యానించారు.
శ్రీలంకపై విజయంతో ఊపుమీదున్న బంగ్లాదేశ్
బంగ్లా జట్టు సూపర్-4లో శ్రీలంకపై 3 వికెట్ల తేడాతో విజయం సాధించి దూసుకెళ్తోంది. అదే ఊపులో టీమిండియాను కూడా ఓడించాలని ఉప్పోంగుతోంది. మరి ఈ రోజు జరిగే మ్యాచ్ లో ఏ జట్టు గెలుస్తుందో వేచి చూడాల్సిందే.