
గంగూలీ ఎన్నికైన తర్వాత
బీసీసీఐ అధ్యక్షుడుగా సౌరవ్ గంగూలీ ఎన్నికైన తర్వాత జరుగుతున్న తొలి ఏజీఎం ఇదే. ఈ సమావేశంలో సెక్రటరీ జైషా మొత్తం 12 పాయింట్లతో కూడిన ఏజెండాను బోర్డు సభ్యుల ముందు ఉంచనున్నారు. అయితే, ఈ సమావేశంలో ఆచరణ యోగ్యంగా లేని నిబంధనలను తప్పక మారుస్తామని బోర్డు కోశాధికారి అరుణ్ ధుమాల్ పేర్కొన్నారు.

వయో పరిమితిని టచ్ చేయం
"వయో పరిమితిని టచ్ చేయం. దానిని అలాగే ఉంచుతున్నాం. వయో పరిమితి విషయంలో ఎటువంటి సవరణ చేయబోం. పదవుల మధ్య విరామాన్ని సవరించే అంశంపై దృష్టిసారించాం. స్టేట్ అసోసియేషన్ను నడపడం ద్వారా ఎవరైనా ఆరేళ్లు అనుభవం సంపాదించి ఉంటే అతడికి ఎందుకు విరామం ఎందుకివ్వాలి. క్రికెట్ ప్రయోజనాల దృష్ట్యా ఆ అనుభవాన్ని బీసీసీఐలో ఎందుకు ఉపయోగించుకోవద్దు?" అని అన్నారు.

ఒక రాష్ట్ర సంఘంలో ఆరేళ్లు
"ఒక రాష్ట్ర సంఘంలో ఆరు సంవత్సరాలు గడిపిన తర్వాత ఎవరైనా 67 ఏళ్ళకు చేరుకుంటే... అతను మూడు సంవత్సరాల కూలింగ్ పీరియడ్లోకి వస్తే అప్పటికి అతడికి 70 సంవత్సరాలు. దీంతో అతడు బీసీసీఐకి ఏమీ చేయలేడు. గత నెలలో జరిగిన బీసీసీఐ ఎన్నికలను మీరు చూశారు. ఎన్నికల్లో భాగమైన 38 మందిలో కేవలం నలుగురైదుగురికే సమావేశాల్లో పాల్గొన్న అనుభవం ఉంది" అని ధుమాల్ తెలిపారు.

అనుభవం ఉన్నవారిని
"అలాంటప్పుడు రాష్ట్ర సంఘాల్లో అనుభవం ఉన్నవారిని బీసీసీఐలో ఉపయోగించుకుంటే మంచిది. లోధా సిఫార్సుల ప్రకారమైతే ఒకే సారి అన్ని రాష్ట్రాల్లో ఉన్నవారిని అనర్హులుగా ప్రకటించాలి. ఇది ఎలా ఉందంటే, కాబట్టి, ముందు ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిని తొలగించి, ఆపై కేబినెట్ మంత్రులను అనర్హులుగా ప్రకటించడం" అని ధుమాల్ చెప్పుకొచ్చారు.

సుప్రీం కోర్టుకు సమర్పిస్తాం
"ఏజీఎంలో సవరించిన నిబంధనలను సుప్రీం కోర్టుకు సమర్పిస్తాం. మేము మా దృష్టికోణంలో ఉంచుతాము. కొన్ని విషయాలకు సంబంధించి మనం ఎదుర్కొంటున్న ఆచరణాత్మక ఇబ్బందులను సుప్రీం దృష్టికి తీసుకెళ్తాం. ‘ఒక రాష్ట్రం ఒక ఓటు' వంటి నిబంధనలను గతంలో సుప్రీం కోర్టే సవరించిందని గుర్తుచేశారు. ఒకవేళ కోర్టు మా ఆలోచనతో అంగీకరిస్తే, ఆ సవరణలు ఉంటాయి" అని ధుమాల్ స్పష్టం చేశారు.


Click it and Unblock the Notifications












