హైదరాబాద్: భారత పర్యటన కోసం ఎంతో ఆతృతగా ఉన్నామని దక్షిణాఫ్రికా కెప్టెన్ క్వింటన్ డీకాక్ అన్నాడు. భారత పర్యటనలో భాగంగా దక్షిణాఫ్రికా జట్టు మూడు టీ20లు, మూడు టెస్టు మ్యాచ్ల సిరిస్ ఆడనుంది. టీ20 సిరిస్కు క్వింటన్ డీకాక్ కెప్టెన్గా ఎంపికైన సంగతి తెలిసిందే.
India vs South Africa: భారత పర్యటన నేపథ్యంలో సఫారీ కోచ్కు నిద్రలేని రాత్రులు
ధర్మశాల వేదికగా సెప్టెంబర్ 15న జరిగే తొలి టీ20తో భారత్లో సఫారీల పర్యటన ప్రారంభం కానుంది. ఆ తర్వాత అక్టోబర్ 2 నుంచి విశాఖపట్నం వేదికగా తొలి టెస్టు మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో క్వింటన్ డీకాక్ మాట్లాడుతూ గత పర్యటన కంటే ఈ సారి మెరుగ్గా రాణిస్తామని ఆశాభావం వ్యక్తం చేశాడు.
"మావైపు నుంచి మేం ఏం చేయబోతున్నామంటే... చెత్త ప్రదర్శనకు సిద్ధంగానే ఉన్నాం. కోహ్లీసేనతో పోరుకు అన్ని విధాలుగా సిద్ధంగానే ఉన్నాం. బలమైన భారత్ జట్టు గట్టి సవాల్ విసురుతుంది. నిజాయతీగా చెప్పాలంటే ఏమి సాధిస్తామో మాకు తెలియదు. ఐపీఎల్ అనుభవంతో టీ20ల్లో స్పిన్ అంతగా ప్రభావం చూపదని అనుకుంటున్నాం" అని అన్నాడు.
"కానీ టెస్టులు దీనికి భిన్నంగా ఉంటాయి. తొలి రోజు నుంచి స్పిన్కు అనుకూలించే అవకాశం ఉంది. స్పిన్కు అనుకూలిస్తుందో లేదా అని ముందే అంచనా వేయడం అంత సులువైన విషయం కాదు. గత పర్యటనలో మేము కఠినమైన పిచ్లను ఎదుర్కొన్నాం. ఈ సారి అలా ఉండవని భావిస్తున్నాం. గతంలో కంటే మెరుగ్గా రాణిస్తాం" అని డికాక్ పేర్కొన్నాడు.
గత పర్యటనలో వన్డే, టీ20 సిరీసులు గెలిచిన దక్షిణాఫ్రికా జట్టు టెస్టుల్లో 0-3తో ఓటమి పాలైన సంగతి తెలిసిందే.