Gautam Gambhir: గత ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా ఘోర పరాభవాన్ని చవిచూడడంతో బీసీసీఐ కొన్ని కఠిన నిబంధనలను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అందులో జట్టు విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు ఎక్కువ సమయం కుటుంబానికి కాకుండా ఆటకే కేటాయించాలని బీసీసీఐ స్పష్టం చేసింది. ప్రస్తుతం టీమిండియా ఇంగ్లండ్ జట్టుతో టెస్ట్ సిరీస్ ఆడుతోంది. ఈ టెస్ట్ సిరీస్ కు ముందు గంభీర్ తన తల్లికి అనారోగ్యం దృష్ట్యా స్వదేశానికి వచ్చి వెంటనే ఇంగ్లాండ్ చేరుకున్న సంగతి తెలసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా ప్రధాన కోచ్ బీసీసీఐ నిబంధనలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఛతేశ్వర్ పుజారాతో జరిగిన ఇంటర్వ్యూలో కీలక అభిప్రాయాలను పంచుకున్నాడు.
ఆటగాళ్లకు కుటుంబం ముఖ్యమే అయినా.. దేశ సేవకే ప్రాధాన్యత ఇవ్వాలని గౌతమ్ గంభీర్ అభిప్రాయపడ్డాడు. మనం సెలవుల కోసం విదేశాలకు రాలేదని.. దేశం కోసం ఆడేందుకు వచ్చామని అన్నారు. ఏదైనా పర్యటనకు వెళ్లినప్పుడు డ్రెస్సింగ్ రూమ్లో చాలా తక్కువ మందితో ఆడాల్సి ఉంటుందని.. వారితో పని చేసి దేశం గర్వపడేలా చేయాల్సిన బాధ్యత మనపై ఉంటుందన్నారు. కుటుంబానికి సమయం కేటాయించాలి.. కానీ దేశం కోసం ఆడేందుకు వచ్చినప్పుడు దృష్టి అంతా ఇక్కడే ఉండాలన్నారు. తన వరకు ఈ లక్ష్యమే ఎక్కువ అని గంభీర్ చెప్పుకొచ్చాడు. మనకు ప్రతిరోజు పోరాటమేనని.. దేశం కోసం ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు ఇది తప్పదన్నాడు. మన విజయాలలో కుటుంబాల పాత్ర కూడా ఎక్కువగా ఉంటుందన్నాడు. ఆటగాళ్ల దృష్టంతా పూర్తిగా ఆటపైనే ఉండాలని ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ అభిప్రాయపడ్డారు.

గతంలో ఈ బీసీసీఐ నిబంధనపై స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ విభిన్నంగా స్పందించాడు. కాస్త అసహనం కూడా వ్యక్తం చేశాడు. దీని వల్లే కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయి ఉంటాడని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి. సురేష్ రైనా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, విదేశీ పర్యటనలకు కుటుంబ సభ్యులను అనుమతించకూడదని భారత జట్టు యాజమాన్యం విధించిన నిషేధమే కోహ్లీ, రోహిత్ టెస్టు క్రికెట్ నుండి రిటైర్ అవ్వడానికి కారణమని పేర్కొన్నాడు. ఇది మళ్లీ వివాదానికి దారితీసింది. ప్రస్తుతం బ్యాటింగ్కు అనుకూలమైన పిచ్పై రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు ఉండి ఉంటే మరిన్ని రికార్డులు సృష్టించేవారని చాలా మంది విమర్శిస్తున్నారు.