హైదరాబాద్: ఐపీఎల్ మీడియా హక్కుల వేలం ద్వారా లభించే ఆదాయం రికార్డు స్థాయిలో ఉంటుందని బీసీసీఐ సీఈఓ రాహుల్ జోహ్రీ అన్నారు. రాబోయే ఐదేళ్ల కాలపరిమితో కూడిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మీడియా హక్కులను సోమవారం వేలం వేయనున్నారు.
ఈ సందర్భంగా బీసీసీఐ సీఈఓ రాహుల్ జోహ్రీ మీడియాతో మాట్లాడారు. సోమవారం జరుగబోయే వేలం చారిత్రాత్మకం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఐపీఎల్ హక్కుల కోసం చాలా పెద్ద మొత్తంలో చెల్లించేందుకు చాలా మంది వేచి చూస్తున్నారని అన్నారు.
'ఎంత మొత్తం చెల్లిస్తారనేది ఇప్పుడే చెప్పడం కష్టం. కాకపోతే ఈ వేలాన్ని పారదర్శకంగా నిర్వహించడంపై మేం దృష్టిపెట్టాం. పాత పద్ధతినే కొనసాగించే అవకాశం ఇచ్చిన సుప్రీంకోర్టు, సీవోఏకు కృతజ్ఞతలు' అని జోహ్రీ పేర్కొన్నారు. 2018 నుంచి 2022 కాలపరిమితికి మీడియా హక్కులను బ్రాడ్కాస్ట్, డిజిటల్ రైట్స్ అనే రెండు కేటగిరీల్లో వేలం వేస్తున్నారు.

ఈ హక్కుల ద్వారా దాదాపు రూ. 20 వేల కోట్లు వస్తాయని బీసీసీఐ అంచనా వేస్తున్నారు. 2008లో పదేళ్ల కాలానికి సోనీ పిక్చర్స్ నెట్వర్క్ రూ. 8200 కోట్లు చెల్లించింది. మూడేళ్ల కాలపరిమితితో గ్లోబల్ డిజిటల్ హక్కుల కోసం 2015లో నోవీ డిజిటల్ రూ. 302.2 కోట్లు చెల్లించింది.
'ప్రపంచ వ్యాప్తంగా ఐపీఎల్కు చాలా క్రేజ్ ఉంది. ఇదో పెద్ద క్రికెటింగ్ ఆస్తి. గ్లోబల్ ఇన్వెస్టర్లు వీటికోసం పోటీపడుతున్నారు. దానివల్ల వాళ్లకు కూడా పేరు ప్రతిష్టలు వస్తాయి' అని జోహ్రీ వ్యాఖ్యానించాడు. ఇక, భారత ఉపఖండంలో డిజిటల్ హక్కుల కోసం రిలయన్స్ జియో డిజిటల్, ఎయిర్టెల్ మధ్య గట్టి పోటీ నెలకొంది.
పోటీలో ఉన్న ప్రముఖ సంస్ధలు:
* స్టార్ ఇండియా
* అమెజాన్ సెల్లర్ సర్వీసెస్
* ఫాలోఆన్ ఇంటరాక్టివ్ మీడియా
* తాజ్ టీవీ ఇండియా
* సోనీ పిక్చర్స్ నెట్వర్క్
* టైమ్స్ ఇంటర్నెట్
* ట్విటర్
* ఫేస్బుక్
* యుప్ టీవీ
* డిస్కవరీ
* ఓత్ (యాహూ)
* ఎయిర్టెల్
* గ్రూప్ ఎం మీడియా
* స్కై యూకే
* ఈఎస్పీఎన్ డిజిటల్ మీడియా
* సూపర్స్పోర్ట్ ఇంటర్నేషనల్
* రిలయన్స్ జియో డిజిటల్