WCL 2025, India vs Pakistan: వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ 2025లో భాగంగా నేడు భారత్, పాకిస్తాన్ మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దయింది. బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్ స్టేడియం వేదికగా ఈ సాయంత్రం 4:30 గంటలకు మొదలు కావాల్సిన మ్యాచ్ ఇది. పహల్గామ్ ఉగ్రవాద దాడికి నిరసనగా భారత జట్టు నుంచి నలుగురు ప్లేయర్లు తప్పుకోవడంతో నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
పహల్గామ్ ఉగ్రవాద దాడి అనంతరం చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో పాకిస్తాన్ తో మ్యాచ్ ఆడితే కోట్లాదిమంది భారతీయుల మనోభావాలు దెబ్బతింటాయని, భావోద్వేగాలు రేకెత్తే ప్రమాదం ఉందని వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL) ఓ ప్రకటనలో తెలిపింది. ఫలితంగా- మ్యాచ్ ను రద్దు చేసినట్లు వెల్లడించింది. ఈ మేరకు అధికారిక ప్రకటన జారీ చేసింది.

అంతకుముందు- టీమిండియా మాజీ ప్లేయర్లు శిఖర్ ధావన్, హర్భజన్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్, యూసుఫ్ పఠాన్.. జట్టు నుంచి తప్పుకొన్నారు. పాకిస్తాన్ తో మ్యాచ్ ఆడట్లేదని ప్రకటించారు. డబ్ల్యూసీఎల్ లీగ్ లో పాకిస్తాన్ జట్టుతో జరిగే మ్యాచ్లో తాను ఆడట్లేదంటూ వెల్లడించారు.
భారత్- పాకిస్తాన్ మధ్య నెలకొన్న ప్రస్తుత భౌగోళిక, రాజకీయ పరిస్థితులు, ఉద్రిక్తతలు, యుద్ధ వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పహల్గామ్ దాడి తర్వాత దేశాల మధ్య రాజకీయ సంబంధాలు సరిగా లేనందున వారు ఈ నిర్ణయం తీసుకున్నారు.
వరల్డ్ ఛాంపియన్ షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నమెంట్ కోసం యువరాజ్ సింగ్, శిఖర్ ధావన్, హర్భజన్ సింగ్, సురేష్ రైనా, ఇర్ఫాన్ పఠాన్, యూసుఫ్ పఠాన్, రాబిన్ ఉతప్ప, అంబటి రాయుడు, పీయూష్ చావ్లా, స్టువర్ట్ బిన్నీ, వరుణ్ ఆరోన్, వినయ్ కుమార్, అభిమన్యు మిథున్, సిద్దార్థ్ కౌల్, గురుకీరత్ మాన్ ఎంపికయ్యారు.
పాకిస్తాన్ తరఫున మహ్మద్ హఫీజ్, షోయబ్ మాలిక్, సర్ఫరాజ్ అహ్మద్, షర్జీల్ ఖాన్, వహాబ్ రియాజ్, ఆసిఫ్ అలీ, షాహిద్ అఫ్రిది, కమ్రాన్ అక్మల్, అమీర్ యామిన్, సోహైల్ ఖాన్, సొహైల్ తన్వీర్.. ఆడుతున్నారు.
వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ ఓ ప్రైవేట్ లీగ్ టోర్నమెంట్. దీనికి ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు గుర్తింపు ఉంది. భారత్, పాకిస్తాన్, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్లు పోటీపడుతున్నాయి. ఈ లీగ్ కు ర్యాపర్ ఆర్టిస్ట్ హర్షిత్ తోమర్, బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ కో స్పాన్సర్లుగా వ్యవహరిస్తోన్నారు.