WCL 2025: వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ 2025 షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి జులై 20 కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏళ్ల తర్వాత భారత్, పాకిస్థాన్ దిగ్గజ ఆటగాళ్ల మధ్య 22 గజాల పిచ్పై పోరు జరగాల్సి ఉంది. అయితే మ్యాచ్కు ఒక రోజు ముందే టీమిండియాలోని పలువురు క్రికెటర్లు ఈ మహాసమరంలో ఆడటానికి నిరాకరించారు. హర్భజన్ సింగ్, శిఖర్ ధావన్, సురేశ్ రైనా సహా మొత్తం ఐదుగురు ఆటగాళ్లు పాకిస్థాన్కు వ్యతిరేకంగా జరిగే మ్యాచ్ను బాయ్కాట్ చేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో నిర్వాహకులు తప్పనిసరిగా ఈ హై-వోల్టేజ్ మ్యాచ్ను రద్దు చేయాల్సి వచ్చింది. ఇంగ్లండ్ గడ్డపై జరిగిన ఈ ఘోర పరాభవాన్ని పాకిస్థాన్ ఇంకా జీర్ణించుకోకముందే పొరుగు దేశానికి మరో షాక్ తగిలింది.
మ్యాచ్ రద్దు తర్వాత పాకిస్థాన్కు మరో దెబ్బ
మ్యాచ్ రద్దయిన తర్వాత ఈ టోర్నమెంట్లో స్పాన్సర్గా ఉన్న'ఈజ్మైట్రిప్' (EaseMyTrip) అనే సంస్థ పాకిస్తాన్కు మరో గట్టి షాక్ ఇచ్చింది. పాకిస్తాన్ జట్టు పాల్గొనే ఏ మ్యాచ్ను కూడా తాము ప్రమోట్ చేయబోమని ఆ సంస్థ తన 'ఎక్స్' (గతంలో ట్విట్టర్) ఖాతాలో స్పష్టంగా ప్రకటించింది. కంపెనీ తన ట్వీట్లో ఇలా రాసింది. "వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్తో ఐదేళ్ల ఒప్పందం చేసుకున్నప్పటికీ రెండేళ్ల క్రితమే మేము మా వైఖరిని స్పష్టం చేశాము, పాకిస్తాన్ జట్టు పాల్గొనే ఏ మ్యాచ్లోనూ 'ఈజ్మైట్రిప్' భాగం కాదు. ఇండియా ఛాంపియన్స్కు మద్దతు ఇవ్వడం మాకు గర్వకారణం. మేము మా జట్టుతో నిలబడతాము. అయితే, మాకు కొన్ని సూత్రాలు ఉన్నాయి, దీని కారణంగా మేము పాకిస్తాన్ ఆడే మ్యాచ్ను సపోర్ట్ చేయము లేదా ప్రమోట్ చేయము." అని స్పష్టం చేసింది.

బాయ్కాట్ చేసిన భారత ఆటగాళ్లు
జులై 20న ఎడ్జ్బాస్టన్లో భారత్, పాకిస్థాన్ జట్లు తలపడాల్సి ఉంది. అయితే ఒక రోజు ముందుగానే శిఖర్ ధావన్ ట్వీట్ చేస్తూ ఈ మ్యాచ్లో ఆడటానికి నిరాకరించాడు. గబ్బర్ తన పోస్ట్లో ఇలా రాశాడు. "మే 11న తీసుకున్న నిర్ణయానికి నేను ఈరోజు కూడా కట్టుబడి ఉన్నాను. నా దేశం నాకు సర్వస్వం, దేశం కన్నా గొప్పది ఏదీ లేదు. జై హింద్" అని ఆయన అన్నారు. శిఖర్ ధావన్తో పాటు ఇర్ఫాన్ పఠాన్, హర్భజన్ సింగ్, యూసుఫ్ పఠాన్ కూడా ఈ మ్యాచ్ను బాయ్కాట్ చాయాలని నిర్ణయించుకున్నారు.