న్యూఢిల్లీ: ప్రపంచ కప్ 2023లో టీమిండియా హవా కొనసాగుతోంది. వరుసగా రెండో మ్యాచ్లో నెగ్గి కాకమీదుంది టీమ్. ఇదే ఊపుతో ఇక పాకిస్తాన్పై జెండా ఎగరేయడానికి రెడీ అవుతోంది. ఎల్లుండే ఈ హైఓల్టేజ్ మ్యాచ్ షెడ్యూల్ అయింది. అటు పాకిస్తాన్ కూడా వరుస విజయాలతో దూకుడు కొనసాగిస్తోంది.
తొలి మ్యాచ్లో ఆస్ట్రేలియా, మలి మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ను మట్టికరిపించింది భారత్. బుధవారం రాత్రి ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో ఆఫ్ఘన్ను ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్.. నిర్ణీత 50 ఓవర్లల్లో ఎనిమిది వికెట్ల నష్టానికి 272 పరుగులు చేయగా.. 35 ఓవర్లల్లో కొట్టిపడేసింది టీమిండియా.

కేప్టెన్ రోహిత్ శర్మ సెంచరీతో అదరగొట్టాడు. 84 బంతుల్లోనే 131 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్లో 16 బౌండరీలు, అయిదు భారీ సిక్సర్లు నమోదయ్యాయి. విరాట్ కోహ్లీ- 55 (నాటౌట్), ఇషాన్ కిషన్- 47 పరుగులు చేశారు. శ్రేయాస్ అయ్యర్- 25 పరుగులతో చివరి వరకూ క్రీజ్లో నిలిచాడు.
ఇదే మ్యాచ్లో హాఫ్ సెంచరీ అందుకున్నాడు విరాట్ కోహ్లీ. ఇది అతని 68వ అర్థసెంచరీ. ఇందులో 46 అర్ధసెంచరీలు ఛేజింగ్లో సమయంలో సాధించినవే. ప్రత్యర్థి జట్టు నిర్దేశించిన టార్గెట్ను అందుకోవడంలో 46 హాఫ్ సెంచరీలు చేశాడు. ఇది హయ్యెస్ట్. ఇప్పటివరకు ఈ రికార్డ్ సచిన్ టెండుల్కర్ పేరు మీద ఉండేది. ఛేజింగ్లో 45 హాఫ్ సెంచరీలు చేశాడు సచిన్.
సాధారణంగా ఛేజింగ్ అంటే తనకు ఎంతో ఇష్టమని చాలా సందర్భాల్లో చెప్పుకొన్నాడు విరాట్ కోహ్లీ. ప్రత్యర్థి జట్టు లక్ష్యాన్ని నిర్దేశించడం అంటే రెచ్చగొట్టినట్టే భావిస్తానని వ్యాఖ్యానిస్తాడు. ఆ టార్గెట్ను కొట్టి తీరుతాననీ పేర్కొన్నాడు. ఈ క్రమంలో రెచ్చిపోయి బ్యాటింగ్ చేస్తుంటాడు కోహ్లీ. అవలీలగా పరుగులు అతని బ్యాట్ నుంచి ప్రవహిస్తుంటాయి. ఈ విషయం చాలా మ్యాచ్లల్లో రుజువయింది కూడా.