పెర్త్: ఓ పాత్రికేయుడి పైన విరాట్ కోహ్లీ బూతులు తిట్టిన వివాదం మరిచిపోకముందే మరో వివాదం వెలుగు చూసింది. ఈసారి భారత్కు చెందిన మరో క్రికెటర్ స్టార్ట్ బిన్నీ భార్య మాయంతి లాంగర్ విషయంలో! శుక్రవారం వాకా మైదానంలో ఓ విలేకరిపై కోహ్లీ అసభ్య పదజాలంతో విరుచుకుపడ్డాడు. అనంతరం అతనికి క్షమాపణలు చెప్పుకున్నాడు.
బిన్నీ భార్య మాయంతి లాంగర్ టీవీ స్పోర్ట్స్ జర్నలిస్ట్. ఆమె ఐసీసీ ప్రపంచకప్ను కవర్ చేస్తున్నారు. సమాచారం మేరకు... భారత్, వెస్టిండీస్ జట్లు ప్రాక్టీస్ చేస్తున్న వద్దకు వచ్చారు. ఆమె క్రిస్ గేల్, ఆంబ్రోస్ ఇంటర్వ్యూ తీసుకున్నారు. ఆమె ఆ సమయంలో తమ ఛానల్కు చెందిన ఇతర సభ్యులతో కలిసి.. ట్రెయినింగ్ గ్రౌండ్ సమీపంలో కూర్చున్నారు.
అక్కడే భారత ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తున్నారు. అయితే, ప్రాక్టీస్ చేస్తుంటే పక్కన కూర్చోవద్దని, మరోచోట కూర్చోవాలని భారత మేనేజ్మెంట్ ఆమెతో పాటు అక్కడున్న వారికి సూచించారు.
బీసీసీఐ ప్రియురాళ్లను, భార్యలను క్రికెటర్లతో ఉండవద్దని ఇటీవల నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే, ఆ తర్వాత బీసీసీఐ.. ఈ నిర్ణయాన్ని భారత్ క్వార్టర్ ఫైనల్కు చేరిన తర్వాత అని చెప్పింది. అయితే, మాయంతి తన వృత్తి ధర్మంలో భాగంగా ఇంటర్వ్యూ చేసిందనే వారు కూడా లేకపోలేదు.
కాగా, పెర్త్లోని వాకా మైదానంలో మంగళవారం ప్రాక్టీస్ సెషన్ ముగించుకున్న కోహ్లీ తిరిగి డ్రెస్సింగ్ రూమ్కు వెళ్తున్నపుడు అతనికి మార్గమధ్యలో ఓ జాతీయ దినపత్రిక విలేకరి కనబడ్డాడు. అంతే ఆగ్రహంతో కోహ్లీ ఆయనపై బూతు పురాణం అందుకున్నాడు. విరాట్ తిట్లకు పక్కనే ఉన్న సహచరులు కూడా ఆశ్చర్యపోయారు.
తనను ఎందుకు తిడుతున్నాడో కూడా తెలియని ఆ రిపోర్టర్ కూడా గందరగోళానికి గురయ్యాడు. అనంతరం సహచరులు సముదాయించడంతో కోహ్లీ అసలు విషయం చెప్పాడు. గతంలో తన గురించి, ప్రియురాలు అనుష్క గురించి అవాస్తవ కథనం రాసింది ఆ రిపోర్టరేనని తోటి ఆటగాళ్లకు చెప్పాడు.
అయితే ఆ వార్త రాసింది సదరు రిపోర్టర్ కాదని తెలియడంతో కోహ్లీ అతనికి క్షమాపణలు చెప్పాడు. దీనిపై రవిశాస్త్రి.. కోహ్లీని హెచ్చరించినట్లుగా తెలుస్తోంది. మీడియాతో జాగ్రత్త వహించాలని హితవు పలికారు.