మెల్బోర్న్: ఐసీసీ వరల్డ్ కప్లో యావత్ క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న నాకౌట్ దశ ఆరంభమైంది. నాకౌట్ దశలో తొలి మ్యాచ్లో భాగంగా శ్రీలంక Vs దక్షిణాఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్లో దక్షిణాఫ్రికా విజయం సాధించింది.
ఇక నాకౌట్లో రెండో మ్యాచ్గా మార్చి 19 (గురువారం)న బంగ్లాదేశ్ Vs భారత్ మధ్య జరగనుంది. అయితే ఈ మ్యాచ్ మార్చిలో జరగుతుండటం యావత్ భారత్ క్రికెట్ అభిమానులు కలవరపెడుతోంది. అందుకు కారణం బంగ్లాదేశ్, భారత్ మధ్య మార్చిలో జరిగిన మ్యాచ్ల్లో బంగ్లాదేశ్ గెలుపొందడమే.

గతంలో బంగ్లాదేశ్, భారత్ మధ్య మార్చిలో జరిగిన రెండు మ్యాచ్ల్లో కూడా బంగ్లాదేశ్ గెలుపొందింది. ఈ విషయం యావత్ భారత్ క్రికెట్ అభిమానులతో పాటు, బీసీసీఐ బోర్డును కూడా కాస్తంత కలవరపెడుతోంది. అయితే ఈ సారి మార్చి ఎఫెక్ట్ను టీమిండియా తిరిగరాస్తారా లేదా చరిత్ర సృష్టిస్తారా...?
వెస్టిండిస్లోని పోర్ట్ స్పెయిన్లో బంగ్లాదేశ్, భారత మధ్య జరిగిన మ్యాచ్లో బంగ్లాదేశ్, భారత్పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అదే విధంగా 2012, మార్చి 16న ఆసియా కప్లో 290 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ అలవోకగా చేధించి భారత్పై 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. అదే మ్యాచ్లో క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ తన కెరీర్లో 100వ (147 బంతుల్లో 114 పరుగులు) సెంచరీని సాధించాడు.
ఇక వన్డే క్రికెట్లో 29 సార్లు భారత్, బంగ్లాదేశ్ తలపడగా కేవలం మూడు సార్లు మాత్రమే బంగ్లాదేశ్... భారత్పై విజయం సాధించింది. టీమిండియా బంగ్లాదేశ్పై 24సార్లు గెలుపొందగా, 2 సార్లు ఫలితం తేలలేదు. వరల్డ్ కప్లో భారత్ - బంగ్లాదేశ్ రికార్డు 1-1. 2007 వరల్డ్ కప్లో లీగ్ మ్యాచ్లో భారత్ను ఇంటికి పంపడంలో బంగ్లాదేశ్పై ఓటమే కారణమనే విషయం యావత్ ప్రపంచానికి తెలిసిందే.
ఆస్టేలియాలో జరుగుతున్న వరల్డ్ కప్లో భారత్, బంగ్లాదేశ్లు క్వార్టర్ ఫైనల్లో తలపడటం ఇదే తొలిసారి. 2007 వరల్డ్ కప్ ఎడిషన్లో బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని డకౌట్గా వెనుదిరిగాడు. వరల్డ్ కప్లో భారత్పై ఒక్క బంగ్లాదేశ్ బ్యాట్స్మెన్ కూడా సెంచరీ చేయకపోవడం విశేషం.