ఒక్కోసారి చిన్న చిన్న పొరపాట్లే క్రికెట్లో మ్యాచ్ ఫలితాలు మార్చేస్తాయి. కొందరికి రూల్స్ తెలియకపోవడం వాళ్ల కొంప ముంచుతుంది. ఇలా క్రికెట్ రూల్స్ తెలియక పోవడం వల్ల తాజాగా మహిళల బిగ్ బ్యాష్ లీగ్లో బ్రిస్బేన్ హీట్ జట్టు ఓటమిపాలైంది. బోర్డర్ మైదానంలో బ్రిస్బేన్ హీట్, సిడ్నీ సిక్సర్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచులో తొలుత బ్రిస్బేన్ టీం బ్యాటింగ్ చేసింది.
ఆల్రౌండర్ అమీలియా కెర్ (44 బంతుల్లో 64), మిగ్నాన్ డు ప్రీజ్ (27 బంతుల్లో 42), చార్లీ నాట్ (10 బంతుల్లో 29) రాణించారు. వీళ్లు అద్భుతంగా ఆడటంతో బ్రిస్బేన్ హీట్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. టీ20ల్లో ఇది మంచి స్కోరే. అయితే లక్ష్య ఛేదనలో సిడ్నీ సిక్సర్స్ కూడా అదరగొట్టింది.

యాష్లీ గార్డనర్ (36), ఎరిన్ బర్న్స్ (30) ఆ జట్టు తరఫున కీలక ఇన్నింగ్సులు ఆడారు. దీంతో 19.5 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయిన సిడ్నీ సిక్సర్స్.. లక్ష్యాన్ని ఛేదించింది. అయితే ఇలా బ్రిస్బేన్ ఓడిపోవడానికి సిడ్నీ అద్భుతమైన ఆటతీరే కారణం కాదు. బ్రిస్బేన్ టీంలోని స్టార్ ప్లేయర్ అమీలియా కెర్ చేసిన పొరపాటే కారణం.
రెండో ఇన్నింగ్సులో మంచు ప్రభావం ఉండటంతో బ్రిస్బేన్ జట్టు సభ్యులంతా.. బంతిని అందుకొని, దాన్ని తమ వద్ద ఉన్న టవల్స్తో షైన్ చేస్తున్నారు. కెర్ కూడా అదే పని చేయబోయింది. అయితే మరీ తొందర పడిన ఆమె.. చేతిలో టవల్ ఉంచుకొనే.. ఫీల్డర్ వేసిన బంతిని క్యాచ్ పట్టేసింది. ఇది ఎంసీసీ నిబంధనల ప్రకారం తప్పు.
దీన్ని గమనించిన అంపైర్లు.. కెర్కు వార్నింగ్ ఇచ్చారు. అలాగే సిడ్నీ జట్టుకు అదనంగా ఐదు పరుగులు అందజేశారు. ఈ పెనాల్టీ కనుక బ్రిస్బేన్ జట్టుపై పడకుంటే.. చివరి బంతికి ఆ జట్టు ఐదు పరుగులు చేయాల్సి వచ్చేది. ఆ సమయంలో సిక్సర్ బాదడం ఒక్కటే మార్గం. దీంతో ఒత్తిడికి గురయ్యే ఛాన్స్ కూడా ఉంది. అప్పుడు బ్రిస్బేన్కే విజయం దక్కేది.
ఇదంతా గమనించిన ఫ్యాన్స్ అయితే షాక్ అయిపోయి తల పట్టుకుంటున్నారు. ఇలా చేతిలో టవల్తో బంతిని క్యాచ్ చేయకూడదని తమకు ఇప్పుడే తెలుసునని అంటున్నారు. కెర్ కనుక ఈ పొరపాటు చేయకుంటే బ్రిస్బేన్ హీట్ కచ్చితంగా గెలిచేదని అభిప్రాయపడుతున్నారు.