
హైదరాబాద్: ఐపీఎల్ చరిత్రలో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు షేన్ వాట్సన్ సరికొత్త రికార్డుని నెలకొల్పాడు. ఐపీఎల్ టోర్నీలో భాగంగా ఆదివారం రాత్రి ముంబైలోని వాంఖడె స్టేడియంలో జరిగిన ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్, సన్రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో భాగంగా ఛేజింగ్లో సెంచరీ సాధించిన తొలి ఆటగాడిగా వాట్సన్ సరికొత్త రికార్డు సృష్టించాడు.
సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన ఫైనల్లో షేన్ వాట్సన్(117 నాటౌట్) అజేయ సెంచరీతో జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. దీంతో ఐపీఎల్ ఫైనల్లో లక్ష్య ఛేదనకు దిగి సెంచరీ నమోదు చేసిన తొలి ఆటగాడిగా షేన్ వాట్సన్ గుర్తింపు సాధించాడు. అంతేకాదు మొత్తంగా వాట్సన్ ఐపీఎల్ ఫైనల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు.
అంతకముందు ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్లో ఛేదనలో అత్యధిక స్కోరు చేసిన ఆటగాళ్ల జాబితాలో మనీష్ పాండే(94-2014 సీజన్), మన్వీందర్ బిస్లా(89-2012 సీజన్), క్రిస్ గేల్(76-2016 సీజన్)లు ఉన్నారు. కాగా, ఆదివారం నాటి మ్యాచ్లో షేన్ వాట్సన్ సెంచరీ నమోదు చేయడంతో ఐపీఎల్ ఫైనల్స్లో సెంచరీ సాధించిన రెండో ఆటగాడిగా షేన్ వాట్సన్ నిలిచాడు.
అంతకమందు 2014లో జరిగిన ఐపీఎల్ ఫైనల్లో వృద్ధిమాన్ సాహా సెంచరీ సాధించాడు. 2014లో జరిగిన ఐపీఎల్ ఫైనల్లో పంజాబ్ తరపున ఆడిన సాహా(115 నాటౌట్) సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్లో కోల్కతా చేతిలో పంజాబ్ ఓటమిపాలైంది.
ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ విశేషాలు:
ఫైనల్ పోరులో సన్రైజర్స్ హైదరాబాద్పై 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించిన చెన్నై ముచ్చటగా మూడోసారి కప్ను ముద్దాడింది. హైదరాబాద్ నిర్దేశించిన 179 పరుగుల లక్ష్యాన్ని చెన్నై 18.3 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ షేన్ వాట్సన్ (57 బంతుల్లో 117 నాటౌట్, 11ఫోర్లు, 8సిక్స్లు) అద్భుత సెంచరీతో చెన్నై విజయంలో కీలకపాత్ర పోషించాడు.
చెన్నై ఇన్నింగ్స్లో తొలి మూడు ఓవర్లలో 5 పరుగులే రావడంతో డుఫ్లెసిస్ తీవ్ర ఒత్తిడికి లోనయ్యాడు. నాలుగో ఓవర్లో భారీ షాట్కు ప్రయత్నించి సందీప్కే రిటర్న్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో చెన్నై 16 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత ఆరో ఓవర్ నుంచి షేన్ వాట్సన్ నిలకడగా ఆడుతూ స్కోరు బోర్డుని పరిగెత్తించాడు. ఎక్కువగా బ్యాటింగ్ అవకాశం తీసుకుంటూ గ్రౌండ్ నలుమూలల భారీ షాట్లు ఆడాడు.
మరోవైపు సురేశ్ రైనా కూడా దూకుడుగా ఆడటంతో 6, 7 ఓవర్లలో 31 పరుగులు సమకూరాయి. స్కోరు బోర్డులో వేగం పెరిగింది. దీంతో కెప్టెన్ కేన్ విలియమ్సన్ రషీద్ ఖాన్ చేతికి బంతి ఇచ్చాడు. కానీ ఈ ప్రయోగం ఫలితానివ్వలేదు. కౌల్ను లక్ష్యంగా చేసుకుని వాట్సన్ మరో సిక్స్, ఫోర్ బాదడంతో పవర్ప్లేలో 35 పరుగులే చేసిన చెన్నై.. తర్వాతి నాలుగు ఓవర్లలో 45 పరుగులు సాధించింది.
ఆ తర్వాత వాట్సన్ డీప్ బ్యాక్వర్డ్ స్కేర్ లెగ్లో సిక్సర్తో హాఫ్ సెంచరీని (33 బంతులు) పూర్తి చేసుకున్నాడు. 11.5 ఓవర్లలో చెన్నై స్కోరు 100 పరుగులు దాటింది. సందీప్ వేసిన 13వ ఓవర్లో వాట్సన్ విధ్వంసం పరాకాష్టకు చేరింది. ఈ ఓవర్లో హ్యాట్రిక్ సిక్స్, రెండు ఫోర్లతో 27 పరుగులు రాబట్టి చెన్నై శిబిరంలో ఎనలేని ఆనందాన్ని నింపాడు.
14వ ఓవర్లో బ్రాత్వైట్ వేసిన బౌన్సర్కు రైనా వెనుదిరిగాడు. ఈ ఇద్దరి మధ్య రెండో వికెట్కు 9.2 ఓవర్లలో 117 పరుగులు నమోదు చేశారు. రషీద్ బౌలింగ్ను ఆచితూచి ఆడిన రాయుడు (16 నాటౌట్) భువీ బౌలింగ్లో సిక్సర్తో టచ్లోకి వచ్చాడు. వెంటనే రషీద్ బంతిని కవర్స్లోకి పంపి వాట్సన్ (51 బంతుల్లో) సెంచరీ పూర్తి చేశాడు.
ఐపీఎల్ ఫైనల్ ఛేదనలో ఇదే మొదటి సెంచరీ కావడం విశేషం. అన్ని ఐపీఎల్ ఫైనల్స్లో ఇది రెండోది. ఆ వెంటనే వాట్సన్ మరో రెండు ఫోర్లు కొట్టడంతో చెన్నై విజయానికి 18 బంతుల్లో 13 పరుగులు అవసరమయ్యాయి. చివర్లో సిద్ధార్ద్ కౌల్ ఓవర్లో షేన్ వాట్సన్ రెండు ఫోర్లు బాదగా, రాయుడు మరో ఫోర్తో విజయ లాంఛనాన్ని ముగించాడు.
ఓవరాల్గా వాట్సన్ ఐపీఎల్ ఫైనల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. అంతకముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 178 పరుగులు చేసింది.