చివరి బంతి వరకూ
ప్రపంచకప్ టోర్నమెంట్లో భాగంగా లీడ్స్లోని హెడింగ్లే స్టేడియంలో శనివారం ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మ్యాచ్ అనంతరం షానియారా అక్రమ్ ఈ కామెంట్స్ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆప్ఘనిస్తాన్తో మ్యాచ్ ఎంత ఉత్కంఠభరితంగా నడిచిందో తెలిసిందే. చివరి బంతి వరకూ మ్యాచ్ కొనసాగింది. ప్రపంచకప్ టోర్నమెంట్లో మొట్టమొదటిసారిగా ఓ మ్యాచ్ హైటెన్షన్తో కొనసాగింది. ఈ మ్యాచ్లో గెలుపు అంచుల వరకూ వెళ్లిన ఆఫ్ఘనిస్తాన్ బొక్క బోర్లా పడింది.
చెప్పుకోదగ్గ స్కోర్ సాధించినా..
తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు మొత్తం 50 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. అస్ఘర్ ఆఫ్ఘన్, నజీబుల్లా జడ్రన్ మాత్రమే టాప్ స్కోరర్లుగా నిలిచారు. అస్ఘర్ ఆఫ్ఘన్ 35 బంతుల్లో రెండు సిక్సర్లు, మూడు ఫోర్లతో 42 పరుగులు చేశాడు. నజీబుల్లా జడ్రన్ 54 బంతుల్లో ఆరు ఫోర్లతో సరిగ్గా 42 పరుగులే చేసి, షహీన్ అఫ్రిదీ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. వికెట్ కీపర్ ఇక్రమ్ అలీ అకిల్ 66 బంతుల్లో 24, టెయిలెండర్ షమీవుల్లా షిన్వారీ 32 బంతుల్లో ఒక ఫోర్తో 19 పరుగులు చేయడంతో ఆప్ఘన్ ఆ మాత్రం స్కోర్ చేయగలిగింది.
తడబడుతూ.. చివరి బంతి వరకూ!
ఆఫ్ఘనిస్తాన్ విధించిన 227 పరుగుల లక్ష్యాన్ని అధిగమించడానికి పాకిస్తాన్ చివరి వరకూ పోరాడాల్సి వచ్చింది. ఓ దశలో మ్యాచ్ మొత్తం ఆఫ్ఘనిస్తాన్ చేతుల్లోకి వెళ్లిపోయింది కూడా. ఓపెనర్ ఫకర్ జమాన్ తొలి బంతికే అవుట్ కావడం, ఆ తరువాత మిగిలిన బ్యాట్స్మెన్లెవరూ చెప్పుకోదగ్గ స్కోరు సాధించకపోవడం, ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో మ్యాచ్ పాకిస్తాన్ చేతుల్లో నుంచి జారి పోయేలా కనిపించింది. చివరిలో ఇమాద్ వసీం మ్యాచ్ మొత్తాన్నీ మలుపు తిప్పాడు. షాదబ్ ఖాన్తో కలిసి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. 54 బంతుల్లో 49 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు.
టెన్షన్ పెట్టిన మ్యాచ్..
చివరి బంతి వరకూ ఉత్కంఠగా మ్యాచ్ కొనసాగడం పాకిస్తాన్ అభిమానులు, వీక్షకులను విజయంపై కలవరపాటుకు గురి చేసింది. గెలుస్తామా? లేదా? అనే ఆందోళనకు గురయ్యారు వారంతా. ప్రతి బంతీ ఆసక్తి రేకెత్తించిందా మ్యాచ్లో. ప్రతీ పరుగు.. అభిమానుల గుండెల్లో రైళ్లను పరుగెత్తించింది. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రపంచకప్ టోర్నమెంట్లో ఈ స్థాయిలో టెన్షన్కు గురి చేసిన మ్యాచ్ మరొకటి ఇప్పటిదాకా చోటు చేసుకోలేదు. ఈ మ్యాచ్ను అసాంతం తిలకించిన షానియారా అక్రమ్.. తన అనుభవాన్ని ట్వీట్ ద్వారా పంచుకున్నారు. పాకిస్తాన్ ఆడే మ్యాచ్లను చూడటం వల్ల ప్రేక్షకులు, వీక్షకులు తీవ్ర అనారోగ్యానికి గురి అవుతారని ఆమె సరదాగా వ్యాఖ్యానించారు.