న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్లో మంగళవారం రైజింగ్ పుణె సూపర్జెయింట్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం సాధించి ర్యాంకుల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది.
కాగా, ఈ మ్యాచ్లో హైదరాబాద్ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్.. పుణె కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మధ్య ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్ జట్టుపై గెలవాలంటే చివరి ఓవర్లో 14 పరుగులు చేయాల్సిన సమయంలో ధోనీ క్రీజులో ఉన్నాడు.
ఆశీష్ నెహ్రా వేసిన చివరి ఓవర్లో తొలి మూడు బంతుల్లో రెండు పరుగులు మాత్రమే వచ్చాయి. కాగా, ఆ తర్వాతి బంతిని ధోనీ సిక్స్గా మలిచాడు. ఇక రెండు బంతుల్లో ఆరు పరుగులు చేయాల్సి ఉంది.

ఐదో బంతి ధోనీ బ్యాట్కి తగిలి థర్డ్ మ్యాన్గా చేతిలో పడింది. ఒక పరుగు తీసిన ధోనీ.. రెండో పరుగు కోసం ప్రయత్నించగా.. యువీ చాలా వేగంగా స్పందించి బంతిని వికెట్లు కొట్టి ధోనీని రనౌట్ చేశాడు. దీంతో హైదరాబాద్ విజయం ఖాయమైంది.
యువరాజ్.. ధోనీని ఔట్ చేసిన ఆనందాన్ని పళ్లు కొరుక్కుంటూ మైదానం చుట్టూ తిరుగుతూ సహచరులతో పంచుకున్నాడు. కాగా, ధోనీ వల్లే యువరాజ్ టీమిండియాకు దూరమయ్యాడని గతంలో యువీ తండ్రి, మాజీ క్రికెటర్ యోగ్ రాజ్ సింగ్ పలుమార్లు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.