
హైదరాబాద్: తనపై సోషల్ మీడియాలో వస్తోన్న విమర్శలపై యువరాజ్ సింగ్ ధీటుగా బదులిచ్చాడు. వయసు మీద పడుతుందంటూ అతడిపై వస్తోన్న విమర్శలకు గాను ఓ వీడియోతో చెక్ పెట్టాడు. భారత్ తరుపున యువరాజ్ సింగ్ చివరగా 2017 జూన్ 30న వెస్టిండీస్తో జరిగిన వన్డే మ్యాచ్లో పాల్గొన్నాడు.
ఆ తర్వాత నుంచి టీమిండియాలో చోటు కోసం యువరాజ్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. అయితే, జట్టులో చోటు దక్కించుకోవాలంటే ముందుగా అతడు యో-యో టెస్టులో పాసవ్వాలి. గతంలో పలుమార్లు ఈ యో-యో టెస్టులో విఫలం కావడంతో ఇక, భారత జట్టులో యువీకి చోటు దక్కడం కష్టమేనని అంటున్నారు.
వయసు మీద పడటంతోనే యువీ జట్టులో చోటు దక్కించుకోలేకపోతున్నాడంటూ సోషల్ మీడియాలో పలువురు కామెంట్లు చేస్తున్నారు. అలాగే పవర్ ట్రైనింగ్కు అతడి వయసు ఎక్కువవుతుందని, సాధారణ వ్యాయామాలకే పరిమితం కావాలంటూ సలహా కూడా ఇచ్చారు కొందరు నెటిజన్లు.
ఈ కామెంట్లకు యువీ తనదైన శైలిలో ఓ వీడియో పోస్టు చేస్తూ బదులిచ్చాడు. "గతేడాది నేను పవర్ ట్రైనింగ్కు పనికిరానని చెప్పారు. నా లక్ష్యాలు సాధించేవరకు నేను ప్రయత్నిస్తూనే ఉంటా. కొత్త సీజన్లోకి వెళ్లేందుకు ఎదురు చూస్తున్నాను. కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఎప్పుడూ ఆలస్యం కాదని గుర్తుంచుకోండి. మళ్లీ చేయండి. కాదని ఎప్పుడూ చెప్పకండి" అని ఇనిస్టాగ్రామ్లో పోస్టు పెట్టాడు.
ఇప్పటివరకు భారత్ తరఫున యువరాజ్ సింగ్ 304 వన్డేలాడి 8,701 పరుగులు చేశాడు. అలాగే 40 టెస్టు మ్యాచ్లతో పాటు 58 టీ20 మ్యాచ్లాడాడు. 2012లో భారత్ ప్రభుత్వం నుంచి అర్జున అవార్డుని సైతం అందుకున్నాడు. 2011లో జరిగిన ఐసీసీ ప్రపంచకప్లో మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డుని కూడా సాధించాడు.