హైదరాబాద్: మూడు టెస్టు మ్యాచ్ల సిరిస్లో భాగంగా శ్రీలంక-భారత్ జట్ల మధ్య బుధవారం గాలేలో తొలి టెస్టు ప్రారంభమైంది. తొలిరోజు ఆటలో భాగంగా భారత బ్యాట్స్మెన్ శిఖర్ ధావన్, ఛటేశ్వర్ పుజారాలు సెంచరీలతో కదం తొక్కడంతో టీమిండియా భారీ స్కోరు దిశగా సాగుతోంది.
తొలిరోజు శ్రీలంక బౌలర్లను ఓపెనర్ శిఖర్ ధావన్ ఉతికి ఆరేస్తున్న సమయంలో ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా తనలోని చిలిపి తనాన్ని ప్రదర్శించాడు. శ్రీలంక బౌలర్లను యాక్షన్ను జడేజా డ్రెస్సింగ్ రూమ్లో అనుకరించి భారత బృందంలో నవ్వులు పూయించాడు.
శ్రీలంక బౌలర్లు ఇలా బౌలింగ్ చేస్తున్నారంటూ యాక్టింగ్ చేసి మరీ చూపించాడు. జడేజా చేసిన యాక్షన్కు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు కోచ్ రవిశాస్త్రి సహాయక సిబ్బంది సైతం పగలబడి నవ్వారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
@imjadeja is making joke on someone bowling action pic.twitter.com/r1DhJhnRKO
— ABHISHEK PANDEY (@abhishkpandey29) 26 July 2017
అవకాశం లభించినప్పుడల్లా జట్టులోని సహచర ఆటగాళ్లను ఆట పట్టించడం జడేజాకు అలవాటే. అంతేకాదు మైదానంలో బ్యాట్ను తల్వార్లా తిప్పుతూ గతంలో పలుమార్లు కత్తి డ్యాన్స్ చేసి అభిమానులను అలరించాడు.
ఇదిలా ఉంటే తొలి టెస్టులో రెండో రోజు లంచ్ విరామానికి టీమిండియా 7 వికెట్లు కోల్పోయి 503 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో పాండ్యా 4, రవీంద్ర జేడేజా 8 పరుగులతో ఉన్నారు. 399/3 పరుగుల ఓవర్నైట్ స్కోరుతో గురువారం రెండో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది.
పుజారా 153 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటైన తర్వాత రహానే వికెట్ కూడా కోల్పోయింది. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన సాహా-అశ్విన్ల జోడీ వికెట్ల పతనాన్ని అడ్డుకుంది. అయితే 16 పరుగులు చేసిన సాహా... హెరాత్ పెవిలియన్కు చేరాడు. మరో నాలుగు పరుగుల వ్యవధిలోనే అశ్విన్ కూడా అవుటయ్యాడు.
అశ్విన్ 60 బంతుల్లో ఏడు ఫోర్లతో 47 పరుగులు చేశాడు. ప్రస్తుతం భారత్ 117 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 503 పరుగులు చేసింది. శ్రీలంక బౌలర్లలో ప్రదీప్ 5 వికెట్లు తీసుకోగా, లాహిరు, హెరాత్ చెరో వికెట్ తీసుకున్నారు.