
హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ రనౌట్ అవడం చాలా అరుదు. ఎందుకంటే వికెట్ల మధ్య వేగంగా పరుగు తీయడంలో విరాట్ కోహ్లీ తర్వాత ఎవరైనా. ఆదివారం కటక్ వేదికగా వెస్టిండిస్తో జరిగిన మూడో వన్డే చివర్లో జడేజాతో కలిసి కోహ్లీ సింగిల్స్ తీయడం వెస్టిండిస్ ఫీల్డర్లకు అసహనాన్ని తెప్పించింది.
ఈ క్రమంలో సహనం కోల్పోయిన విండిస్ బౌలర్ షెల్డన్ కాట్రెల్ కెప్టెన్ విరాట్ కోహ్లీని రనౌట్ చేసేందుకు బంతిని కాలితో వికెట్లపైకి తన్నాడు. అయితే, బంతి వికెట్ల దూరంగా వెళ్లడంతో విరాట్ కోహ్లీ రనౌటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండిస్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 315 పరుగులు చేసింది.
అనంతరం 316 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా విజయానికి 30 బంతుల్లో 38 పరుగులు అవసరమయ్యాయి. ఈ సమయంలో షెల్డన్ కాట్రెల్ బౌలింగ్కి వచ్చాడు. దీంతో భారీ షాట్లకు వెళ్లకూడదని నిర్ణయించుకున్న కోహ్లీ-జడేజా సింగిల్స్ కోసం ప్రయత్నించారు. ఆ ఓవర్లో చివరి నాలుగు బంతుల్నీ వీరిద్దరి జోడి వరుసగా 1, 1, 1, 1 పరుగులగా మలిచారు.
కోహ్లీ-జడేజాలు వరుసపెట్టి సింగిల్స్ తీస్తుంటే... బౌలర్ షెల్డన్ కాట్రెల్తో పాటు వెస్టిండిస్ ఫీల్డర్లు సైతం ఏమీ చేయలేకపోయారు. ఆ ఓవర్లో కాట్రెల్ వేసిన బంతిని జడేజా డిఫెన్స్ ఆడగా కోహ్లీ సింగిల్ కోసం జడేజాను పిలిచాడు. దీంతో కోహ్లీ పరిగెత్తే సమయంలో చిర్రెత్తిపోయిన బౌలర్ కాట్రెల్ పరుగెత్తుకుంటూ వచ్చి బంతిని వికెట్లపైకి తన్నాడు.
అయితే, బంతి వికెట్లకి దూరంగా వెళ్లిపోవడంతో కోహ్లీకి రనౌటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. జట్టు స్కోరు 286 పరుగుల వద్ద కీమో పాల్ బౌలింగ్లో విరాట్ కోహ్లీ(85; 81 బంతుల్లో 9 ఫోర్లు) ఔటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన రవీంద్ర జడేజా(39), శార్ధుల్ ఠాకూర్(17) ఇద్దరూ దూకుడుగా ఆడి జట్టుకు విజయాన్ని అందించారు.
దీంతో మూడు వన్డేల సిరిస్ను టీమిండియా 2-1తో కైవసం చేసుకుని 2019ని విజయంతో ముగించింది.