నాటింగ్హామ్: తనదైన బ్యాటింగ్ శైలితో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రపంచ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్నాడు. అభిమాన క్రికెటర్ తమ దేశంలో పర్యటిస్తోంటే తనతో ఫొటో దిగాలని, ఆటోగ్రాఫ్ తీసుకోవాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి. ఓ చిన్నారి అభిమాని కూడా కోహ్లీతో ఫొటో దిగేందుకు మిగతా అభిమానులతో పోటీపడ్డాడు.
ఆ చిన్నారిని గుర్తించిన కోహ్లీ చిన్నారి ఫ్యామిలీతో కలిసి సెల్ఫీ దిగాడు. ఆటోగ్రాఫ్ కూడా ఇచ్చాడు. దీంతో అతడి ఆనందానికి అవధుల్లేవు. ఇదంతా నాటింగ్హామ్లో బుధవారం చోటు చేసుకుంది. ఆతిథ్య ఇంగ్లాండ్తో మూడో టెస్టు చివరి రోజు ఆట కోసం టీమిండియా ఆటగాళ్లు బస చేసిన హోటల్ వద్ద బస్సు ఎక్కుతున్నారు. ఆ సమయంలో క్రికెటర్లను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
ఇందులో ఓ చిన్నారి అభిమాని కూడా ఉన్నాడు. అభిమానులకు కోహ్లీ ఆటోగ్రాఫ్లు ఇస్తూ బిజీగా ఉన్నారు. ఆ సమయంలో ఆ చిన్నారి అభిమాని 'కోహ్లీ... ఎ పిక్చర్ ప్లీజ్' అంటూ కోహ్లీకి వినబడేలా పలుమార్లు అరిచాడు. అది వినపడో మరి ఏమో కానీ కోహ్లీ అతడి వద్దకు వచ్చి సెల్ఫీ దిగాడు. అంతేకాదు, ఆ అభిమాని వేసుకున్న టీషర్టుపై ఆటోగ్రాఫ్ కూడా ఇచ్చాడు. దీంతో ఆ అభిమాని ఎంతో సంతోషంగా కనిపించాడు.
#WATCH: Indian cricket team Captain Virat Kohli takes a selfie with a child after he was continuously requesting "Virat, a picture please" outside Trent Bridge cricket stadium in England's Nottingham. #INDvsENG pic.twitter.com/ngKsEVXjwd
— ANI (@ANI) August 22, 2018
గతంలోనూ కోహ్లీ పలుసార్లు భద్రతా సిబ్బందిని దాటి వచ్చి అభిమానులతో సెల్ఫీలు దిగుతూ, ఆటోగ్రాఫ్లు ఇస్తూ సందడి చేసిన విషయం తెలిసిందే. ఇంగ్లాండ్తో జరిగిన మూడవ టెస్టులో భారత్ 203 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అయిదు టెస్టుల సిరీస్ను ఈ విక్టరీతో 2-1 ఆధిక్యానికి తగ్గించింది టీమిండియా. ఐదు టెస్టు మ్యాచ్ల సిరీస్లో భాగంగా భారత్-ఇంగ్లాండ్ మధ్య నాలుగో టెస్టు ఈ నెల 30న ప్రారంభంకానుంది.