
హైదరాబాద్: బుధవారం సెడాన్ పార్కులో భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన మూడో టీ20 క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించింది. చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్ సూపర్ ఓవర్లో ప్రేక్షకులను మనివేళ్లపై నిల్చోబెట్టింది. అత్యంత నాటకీయత మధ్య ముగిసిన మ్యాచ్ను అభిమానులు ఎంతగానో ఆస్వాదించారు.
బంతి బంతికి సమీకరణాలు మారిన నేపథ్యంలో మైదానంలో ఉన్న ఆటగాళ్లతో పాటు స్టేడియంలోని ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో మ్యాచ్ను తిలకించారు. మ్యాచ్ జరుగుతుండగా టీమిండియాకు మద్దతుగా వారిని ఉత్సాహపరుస్తూ భారత అభిమానులు 'భారత్ మాతా కీ జై' అంటూ నినాదాలు చేస్తున్నారు.
భారత అభిమానులకు ముందు వరుసలో కూర్చొన్న ఓ న్యూజిలాండ్ యువకుడికి ఇవి ఆసక్తికరంగా అనిపించాయి. వెంటనే వెనక్కి తిరిగి మరీ నాకు నేర్పిస్తారా? అని అడిగాడు. అతడికి ఒక్కో పదం ఎలా ఉచ్చరించాలో భారత అభిమానులు నేర్పించడంతో అతడు 'భారత్ మాతా కీ జై' అని అన్నాడు.
ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నిజానికి న్యూజిలాండ్ క్రీడాకారులు ప్రత్యర్థి ఆటగాళ్లతో స్నేహంగా మెలుగుతారు. అందుకే ప్రతి జట్టూ వారిని గౌరవిస్తుంది. ఈ సిరిస్కు ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో కోహ్లీ సైతం కివీస్పై రివేంజ్ ఉండదని అని చెప్పిన సంగతి తెలిసిందే.