
హైదరాబాద్: మూడు టెస్టు మ్యాచ్ల సిరిస్లో భాగంగా భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య కేప్ టౌన్ వేదికగా తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్లో టీమిండియా డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా అంతర్జాతీయ టెస్టు క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. కెప్టెన్ కోహ్లి చేతుల మీదుగా టెస్ట్ క్యాప్ అందుకున్నాడు.
బుమ్రా అరంగేట్రంతో ఇప్పటి వరకు భారత్ తరఫున టెస్టులాడిన ఆటగాళ్ల సంఖ్య 290కి చేరింది. తొలి టెస్టును కోహ్లీసేన ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఇషాంత్ శర్మను పక్కన పెట్టి అతడి స్ధానంలో బుమ్రాకి చోటు కల్పించాడు. 2016, జనవరి 23న ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేతో టీమిండియాలోకి వచ్చిన బుమ్రా.. అనతికాలంలోనే జట్టులో నమ్మదగిన బౌలర్గా గుర్తింపు పొందాడు.
కాగా, సఫారీ గడ్డపై ఇప్పటి వరకు ముగ్గురు పేస్ బౌలర్లు టెస్టుల్లో అరంగేట్రం చేశారు. 1997లో కేప్టౌన్లో దొడ్డ గణేశ్. 2010లో సెంచూరియన్లో జయ్దేవ్ ఉనద్కత్ ఇప్పుడు కేప్టౌన్లో జస్ప్రీత్ బుమ్రా అరంగేట్రం చేశాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో రాణిస్తోన్న బుమ్రా దక్షిణాఫ్రికా పర్యటన కోసం ఎంపిక చేసిన టెస్టు జట్టులో తొలిసారి స్థానం దక్కించుకున్న సంగతి తెలిసిందే. తొలిసారి టెస్టు సిరిస్కు ఎంపికైన బుమ్రా... తొలి టెస్టులోనే జట్టులో చోటు దక్కించుకున్నాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.