
హైదరాబాద్: మెల్ బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో జట్టు స్కోరు 443/7 వద్ద భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ భారత ఇన్నింగ్స్ను డిక్లేర్ చేశాడు. కాగా, అంతకముందు ఆటలో భాగంగా ఆసీస్ కెప్టెన్ టిమ్ పైన్ భారత బ్యాట్స్మన్ రోహిత్ శర్మను రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు.
రెండో రోజు ఆటలో భాగంగా టిమ్ పైన్ తన మాటలతో రోహిత్ శర్మ దృష్టిని మళ్లించే ప్రయత్నం చేశాడు. చాలా ఓపికగా ఆడుతూ పరుగులు సాధిస్తున్న రోహిత్ శర్మ ఏకాగ్రతను దెబ్బతీసేందుకు ఆసీస్ కెప్టెన్ టిమ్ పైన్ వికెట్ల వెనకాల నుంచి తెగ ప్రయత్నించాడు. లియాన్ బౌలింగ్లో రోహిత్ను టీజ్ చేశాడు.
రోహిత్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో కీపర్గా ఉన్న పైన్.. షార్ట్మిడ్లెగ్లో ఉన్న ఆసీస్ ప్లేయర్ ఆరోన్ ఫించ్తో మాట్లాడాడు. నాథన్ లియాన్ బౌలింగ్ చేస్తున్నప్పుడు ఆరోన్ ఫించ్తో మాట్లాడుతున్నట్లు పైన్ నటించాడు. అదే సమయంలో బ్యాటింగ్ క్రీజులో ఉన్న రోహిత్ శర్మను తన మాటలతో రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు.
గతంలో రాజస్థాన్ రాయల్స్కు ఆడిన ఆరోన్ ఫించ్, రోహిత్ మధ్య పోటీ పెడుతూ "నా ఓటు రాయల్స్కా, ఇండియన్స్కా ఇప్పుడు తేలిపోతుంది. రోహిత్ ఇప్పుడు సిక్స్ కొడితే నేను ముంబైకి మారిపోతా" అంటూ పైన్ వ్యాఖ్యలు చేశాడు. టిమ్ పైన్ తన మాటలతో ఎంత రెచ్చగొట్టే ప్రయత్నం చేసినప్పటికీ, రోహిత్ శర్మ మాత్రం ఎటువంటి సహనాన్ని కోల్పోలేదు.
పైన్ ఆ వ్యాఖ్యలు చేసిన తర్వాత రెండు బంతులను రోహిత్ శర్మ డిఫెన్స్ ఆడాడు. హిత్ను టిమ్ పైన్ టీజ్ చేసిన మాటలు వికెట్ల దగ్గర మైక్లో స్పష్టంగా రికార్డయ్యాయి. ఆ సంభాషణలు కాస్త నవ్వు తెప్పిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఈ వీడియోపై సోషల్ మీడియాలో నెటిజన్లు సైతం ట్రోల్ చేస్తున్నారు. అందుకు సంబంధించిన ట్వీట్లు మీకోసం ప్రత్యేకంగా....