
హైదరాబాద్: మూడు టీ20ల సిరిస్లో భాగంగా భారత్-శ్రీలంక జట్ల మధ్య తొలి టీ20 భువనేశ్వర్ వేదికగా జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో తొలి టీ20 కోసం ఇరు జట్ల సోమవారం ఒడిశా రాజధాని భువనేశ్వర్ చేరుకున్నాయి. కటక్లోని బరాబతి స్టేడియంలో ఇరు జట్ల మధ్య తొలి టీ20 జరగనుంది.
మూడు వన్డేల సిరిస్లో భాగంగా చివరి వన్డే విశాఖపట్నం వేదికగా ఆదివారం ముగిసిన సంగతి తెలిసిందే. వన్డే సిరిస్ను 2-1తో టీమిండియా కైవసం చేసుకుంది. వన్డే సిరిస్ ముగిసిన అనంతరం ఇరు జట్లు విశాఖపట్నం నుంచి నేరుగా ప్రత్యేక విమానంలో సోమవారం ఒరిస్సాకు చేరుకున్నాయి.
బిజూ పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇరు జట్లకు ఘన స్వాగతం లభించింది. విమానాశ్రయం నుంచి ఇరు జట్లను భద్రతా సిబ్బంది మధ్య హోటళ్లకు తరలించారు. మంగళవారం ఇరు జట్లు ప్రాక్టీస్ సెషన్లో పాల్గొంటాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు శ్రీలంక... మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు టీమిండియా ప్రాక్టీస్ చేయనుంది.