
హైదరాబాద్: హైదరాబాద్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా పేసర్ మహమ్మద్ షమీ అద్భుత ప్రదర్శన చేశాడు. ఈ మ్యాచ్లో మొత్తం 10 ఓవర్లు వేసిన షమీ 2 మెయిడిన్ ఓవర్లతో పాటు 2 వికెట్లు తీసి 44 పరుగులు సమర్పించుకున్నాడు. ముఖ్యంగా రెండో టీ20లో సెంచరీతో ఆసీస్ విజయంలో కీలకపాత్ర పోషించిన గ్లెన్ మ్యాక్స్వెల్ను క్లీన్ బౌల్డ్ చేశాడు.
అంతేకాదు వరుస ఓవర్లలో ఆస్టన్, మ్యాక్స్వెల్ వికెట్లను తీసి ఆస్ట్రేలియా తక్కువ స్కోరుకే పరిమితమయ్యేలా చేశాడు. మ్యాక్స్వెల్ను కట్టడి చేయడానికి కోహ్లీ... బుమ్రాను ప్రయోగించడానికి పెద్దగా ఫలితం లేకపోయింది. బుమ్రా, కుల్దీప్లను మ్యాక్స్వెల్ అద్భుతంగా ఎదుర్కొన్నాడు. అయితే, షమీ మాత్రం మ్యాక్స్వెల్ను ఇబ్బంది పెట్టాడు.
ఈ మ్యాచ్తోనే వన్డేల్లోకి అరంగేట్రం చేసిన ఆష్టన్ టర్నర్ (21) షమీ వేసిన 36వ ఓవర్లో సిక్స్ కొట్టాడు. కానీ తర్వాత నాలుగు బంతులను అద్భుతంగా వేసిన షమీ.. మరుసటి ఓవర్లో టర్నర్ను బౌల్డ్ చేశాడు. ఆ తర్వాతి ఓవర్లో క్రీజులో పాతుకుపోయి ప్రమాదకరంగా మారుతోన్న మ్యాక్స్వెల్ను బౌల్డ్ చేసి ఆస్ట్రేలియాకు షాకిచ్చాడు.
ఈ మ్యాచ్లో ఆసీస్ బ్యాట్స్మెన్ పరుగులు చేయకుండా భారత బౌలర్లు కట్టడి చేశారు. దీంతో ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 236 పరుగులు చేసింది. దీంతో టీమిండియాకు 237 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది. భారత బౌలర్లలో షమీ, బుమ్రా, కుల్దీప్ యాదవ్ చెరో రెండు వికెట్లు తీసుకోగా కేదార్ జాదవ్ ఒక వికెట్ తీసుకున్నాడు.