న్యూఢిల్లీ: పాకిస్ధాన్ క్రికెట్ జట్టు సభ్యులతో కలిసి భారత టెన్నిస్ స్టార్ సానియా మిర్జా డ్యాన్స్ చేసింది. ఆదివారం శ్రీలంకతో ఆ దేశ జట్టుతో జరిగిన మ్యాచ్లో పాకిస్ధాన్ జట్టు విజయం సాధించింది. దీంతో మ్యాచ్ను చూసేందుకు వెళ్లిన సానియా మిర్జా సంతోషంతో తన భర్తతో కలిసి విజయాన్ని సెలెబ్రేట్ చేసుకుంది.

భర్త షోయబ్ మాలిక్తోపాటు పాక్ ఆటగాళ్లతో కలిసి 'అభీ తో పార్టీ షురూ హుయీ హై (పార్టీ ఇప్పుడే మొదలైంది)' అనే బాలీవుడ్ పాటకు ''డబ్ స్మాష్' డ్యాన్స్ చేసి తన ఆనందాన్ని పంచుకుంది. ఈ వీడియోను షోయబ్ మాలిక్ తన ట్విట్టర్ అకౌంట్లో ట్వీట్ చేశాడు.
ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తుంది. ఇటీవలే వింబుల్డన్లో మహిళల డబుల్స్ టైటిల్ గెలిచిన సంగతి తెలిసిందే. విరామం లభించడంతో శ్రీలంకతో సిరీస్లో భర్త షోయబ్ మాలిక్ ఆడుతుండడంతో ఆమె శ్రీలంకకు వెళ్లింది.
ఆదివారం జరిగిన మూడో వన్డేలో పాక్ 135 పరుగులతో లంకపై ఘన విజయం సాధించింది. 29 బంతుల్లోనే అజేయంగా 42 పరుగులు చేసిన షోయబ్ పాక్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. దీంతో మ్యాచ్ ముగిసిన తర్వాత షోయబ్, సానియా ఇద్దరూ డ్యాన్స్ చేసి సందడి చేశారు. పాక్ ఆటగాళ్లు అదిలీ, అజామ్, ముక్తర్ అహ్మద్, ఇర్ఫాన్ కూడా వారితో కలిసి స్టెప్పులేశారు.