
హైదరాబాద్: వచ్చే ఏడాది ఇంగ్లాండ్ వేదికగా ఐసీసీ వన్డే వరల్డ్ కప్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ వరల్డ్ కప్లో భాగంగా జరుగుతున్న క్వాలిఫయిర్స్ మ్యాచ్లకు జింబాబ్వేలోని హరారే స్పోర్ట్స్ క్లబ్ ఆతిథ్యమిస్తోంది. తాజాగా టోర్నీలో ఐర్లాండ్-వెస్టిండిస్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది.
ఈ మ్యాచ్లో వెస్టిండిస్ ఆటగాడు రోవమన్ పావెల్ కొట్టిన ఓ సిక్సు స్టేడియంలోని ప్రెస్ బాక్సు అద్దాన్ని పగులగొట్టింది. ఐర్లాండ్ బౌలర్ కెవిన్ ఒబ్రెయిన్ వేసిన 49వ ఓవర్ నాలుగో బంతిని సిక్సర్గా మలిచి 95 పరుగులు పూర్తి చేసుకున్న పావెల్, ఆ తర్వాతి బంతిని కూడా సిక్సర్గా మలచి సెంచరీని సాధించాడు.
బంతిని బలంగా కొట్టడంతో అది అది కాస్తా స్టేడియంలోని ప్రెస్ బాక్స్ అద్దాన్ని బలంగా తాకింది. దీంతో స్టేడియంలోని ప్రెస్ బాక్స్ అద్దం పగిలిపోయింది. ఈ మ్యాచ్లో 100 బంతులు ఎదుర్కొన్న పావెల్ 7 ఫోర్లు, 7 సిక్సర్లతో 101 పరుగులు చేశాడు. పావెల్కు అదే అంతర్జాతీయ తొలి సెంచరీ.
ఈ మ్యాచ్లో పావెల్ ఓ వ్యక్తిగత రికార్డుని కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ఏడో స్థానంలో బ్యాటింగ్కు దిగి సెంచరీ సాధించి తొలి వెస్టిండిస్ ఆటగాడిగా పావెల్ చరిత్ర సృష్టించాడు. మ్యాచ్ పూర్తయిన అనంతరం ప్రెస్ బాక్స్లోకి వెళ్లిన పావెల్ పగిలి అద్దంపై సంతకం చేయడం విశేషం.
ఇందుకు సంబంధించిన ఫోటోలను ఐసీసీ ట్విట్టర్లో అభిమానులతో పంచుకుంది. ఈ మ్యాచ్లో వెస్టిండిస్ 52 పరుగులతో ఐర్లాండ్పై ఘన విజయం సాధించి సూపర్ సిక్స్కు అర్హత సాధించింది.