
హైదరాబాద్: టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పరిస్థితులకు అనుగుణంగా తన బౌలింగ్లో మార్పులు చేస్తుంటాడు. ప్రత్యర్ధి జట్టు ఆటగాళ్లను ఇబ్బంది పెట్టేందుకు ఒక్కోసారి ఒక్కవిధంగా బౌలింగ్ చేస్తుంటాడు. స్వతహాగా ఆఫ్ స్పిన్నర్ అయిన అశ్విన్ గతంలో లెగ్ స్పిన్నింగ్ ప్రాక్టీస్ చేశాడు.
అయితే తన లెగ్ స్పిన్నింగ్ మెళకువలను బుధవారం నుంచి ప్రారంభమైన ఇరానీ కప్లో ప్రదర్శించాడు. విదర్భ జట్టుతో జరిగిన మ్యాచ్లో అశ్విన్ లెగ్ స్పిన్నింగ్ బౌలింగ్లో రాణించాడు. అశ్విన్ తన లెగ్ స్పిన్తో విదర్భ ఓపెనర్ ఫైజల్ (82)ను పెవిలియన్కు చేర్చాడు.
ఇందుకు సంబంధించిన వీడియోని బీసీసీఐ ట్విట్టర్లో 'అశ్విన్, ది లెగ్ స్పిన్నర్ని మీకూ పరిచయం చేస్తున్నాం' అంటూ అభిమానులతో పంచుకుంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. నాగ్పూర్ వేదికగా జరుగుతోన్న ఇరాన్ కప్లో అశ్విన్ రెస్టాఫ్ ఇండియా జట్టుకు ఆడుతున్నాడు.
గత కొంతకాలంగా టీమిండియాకు దూరమైన అశ్విన్ దేశవాళీ క్రికెట్కే పరిమితమయ్యాడు. ఇదిలా ఉంటే ఈ ఏడాది అశ్విన్ ఐపీఎల్ 11వ సీజన్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. ఈ మేరకు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మెంటార్, మాజీ క్రికెటర్ సెహ్వాగ్ ఫేస్బుక్ లైవ్ సెషన్లో ప్రకటించిన సంగతి తెలిసిందే.