
హైదరాబాద్: 'తదుపరి ఐపీఎల్ పాకిస్థాన్లో జరుగుతుంది' ఈ మాటలు అన్నది ఎవరో కాదు పాకిస్థాన్ క్రికెటర్ ఉమర్ అక్మల్. ఐపీఎల్ ఏంటీ... పాకిస్థాన్లో జరగడం ఏంటని అనుకుంటున్నారా? పాకిస్థాన్ క్రికెటర్ ఉమర్ అక్మల్ తన ట్విట్టర్లో చేసిన ఓ వీడియో ఈ గందరగోళానికి తెరలేపింది. సోషల్ మీడియాలో పొరపాటు చేసి అభిమానులకు దొరికిపోవడం ఉమర్ అక్మల్కి ఇది కొత్త కాదు.
గతంలో కూడా అనేక సార్లు ఇలానే నెటిజన్లు అక్మల్ను ఓ ఆట ఆడుకున్నారు. తాజాగా పాకిస్థాన్ ప్రిమియర్ లీగ్(పీఎస్ఎల్)ను ప్రమోట్ చేసే క్రమంలో పీఎస్ఎల్కు బదులు ఐపీఎల్ అంటూ సంబోధించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఐపీఎల్ మాదిరే ప్రపంచ వ్యాప్తంగా అనేక లీగ్లు పుట్టుకొచ్చిన సంగతి తెలిసిందే.
అందులో ఒకటి పాకిస్థాన్ సూపర్ లీగ్. అయితే ఈ లీగ్ మొత్తం పాకిస్థాన్లో జరగదు. ఈ లీగ్ ప్రారంభమైనప్పటి నుంచీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో నిర్వహిస్తున్నారు. అయితే, నాకౌట్ మ్యాచ్లు లేదా పైనల్ మ్యాచ్ని మాత్రమే పాకిస్థాన్లో నిర్వహిస్తున్నారు. తాజా సీజన్లో లీగ్ మ్యాచ్లకు దుబాయి ఆతిథ్యమిస్తుండగా... ప్లే ఆఫ్స్ కరాచీలో జరగనున్నాయి.
ఈ నేపథ్యంలో పాకిస్థాన్ సూపర్ లీగ్లో క్వెట్టా గ్లాడియేటర్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తోన్న ఉమర్ అక్మల్ ఓ వీడియోని ట్విట్టర్లో అభిమానులతో పంచుకున్నాడు. అందులో "సొంతగడ్డపై అభిమానుల మద్దతు ఉంటే.. వచ్చే ఐపీఎల్ సారీ.. పీఎస్ఎల్ పాకిస్థాన్లోనే జరుగుతుంది" అని ఉమర్ అక్మల్ అన్నాడు.