
హైదరాబాద్: ఆసీస్ గడ్డపై ద్వైపాక్షిక వన్డే సిరిస్ను గెలవడంలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిది కీలకపాత్ర. ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డేల సిరిస్లో వరుసగా మూడు హాఫ్ సెంచరీలు సాధించి మ్యాన్ ఆఫ్ ద సిరిస్ అవార్డుని సైతం గెలుచుకున్నాడు.
ముఖ్యంగా సిరీస్ విజేతను తేల్చే మూడో వన్డేలో ధోని ప్రశాంతంగా ఆడి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. మెల్బోర్న్ పిచ్ మందకొడిగా ఉండటంతో బ్యాటింగ్ కష్టమైంది. దీంతో ధోని సింగిల్స్ తీయడానికే ప్రాధాన్యం ఇచ్చాడు. ఒకానొక సమయంలో సాధించాల్సిన రన్రేట్ పెరిగినప్పటికీ, ధోని ఒత్తిడికి గురవలేదు.
చివరి వరకూ క్రీజులో ఉండి భారత జట్టుకు సునాయస విజయాన్ని అందించాడు. మైదానంలో కూల్గా ఉంటూ ధోని ఏం చేయాలని అనుకుంటాడో అదే చేస్తాడు. ప్రపంచ క్రికెట్లో బెస్ట్ బ్రెయిన్గా ధోనీకి పేరుంది. తనను అలా ఎందుకు పిలుస్తారో మెల్బోర్న్ వన్డే ద్వారా ధోని మరోసారి ప్రపంచానికి చాటి చెప్పాడు.
47వ ఓవర్ ప్రారంభంలో విజయానికి 24 బంతుల్లో 33 పరుగులు అవసరమైన దశలో ధోని అంపైర్ వద్దకు వెళ్లాడు. ఇంకా ఏ బౌలర్కు ఎన్ని ఓవర్లు మిగిలి ఉన్నాయో అంపైర్ను అడిగి మరీ తెలుసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మూడో వన్డేలో ఆసీస్ బౌలర్లు రిచర్డ్సన్, ఆడమ్ జంపా బౌలింగ్ను ఎదుర్కోవడంలో భారత బ్యాట్స్మెన్ ఇబ్బంది పడ్డారు. దీంతో వారి బౌలింగ్ కోటా ముగిసే వరకూ ఎదురు దాడికి దిగకుండా ధోని నెమ్మదిగా ఆడాడు. విజయానికి ఎన్ని పరుగులు అవసరమో లెక్కవేసుకుని సిడిల్, స్టోయినిస్ బౌలింగ్లో ఆ పరుగులు రాబట్టి భారత్కు విజయాన్ని అందించాడు.
ఆస్ట్రేలియాతో మెల్బోర్న్ వేదికగా శుక్రవారంతో ముగిసిన మూడు వన్డేల సిరీస్లో హ్యాట్రిక్ హాఫ్ సెంచరీలు బాదిన ధోని 193 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచిన సంగతి తెలిసిందే. తొలి రెండు వన్డేల్లోనూ ఐదో స్థానంలో బ్యాటింగ్ చేసిన ధోని.. మూడో వన్డేలో అంబటి రాయుడిపై వేటు పడటంతో నాలుగో స్థానంలో బ్యాటింగ్కి వచ్చాడు.
మూడో వన్డేలో మహేంద్రసింగ్ ధోని (87 నాటౌట్), కేదార్ జాదవ్ (61 నాటౌట్) అజేయ అర్ధశతకాలు బాదడంతో 231 పరుగుల లక్ష్యాన్ని భారత్ మరో 4 బంతులు మిగిలి ఉండగానే ఛేదించిన సంగతి తెలిసిందే. దీంతో మూడు వన్డేల సిరీస్ని 2-1తో చేజిక్కించుకుంది. అంతేకాదు ఆస్ట్రేలియా గడ్డపై ద్వైపాక్షిక వన్డే సిరీస్ గెలవడం భారత్కు ఇదే తొలిసారి.
ఒక్క ఫార్మాట్లో కూడా సిరీస్ కోల్పోకుండా ఆసీస్ పర్యటనను ముగించిన తొలి జట్టుగా టీమిండియా అరుదైన ఘనత సాధించింది. ఈ సిరిస్లో 'మ్యాన్ ఆఫ్ ద సిరీస్' గెలవడంతో ధోని ఖాతాలో అరుదైన రికార్డు నమోదైంది. అత్యంత పెద్ద వయసు (37 ఏళ్ల 195 రోజులు)లో ఈ అవార్డు గెలిచిన భారత ఆటగాడు ధోనీయే. గావస్కర్ (37 ఏళ్ల 191 రోజులు, 1987లో శ్రీలంకపై) రికార్డును ధోని బద్దలు కొట్టాడు.