
4వ వన్డేలో చివరి వరకు పోరాడి ఓటమి పాలైన కోహ్లీసేన
ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేపట్టిన విండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. 190 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా చివరి వరకు పోరాడి ఓటమి పాలైంది. ఒకవైపు టపటపా వికెట్లు పడుతున్నా.. మరోవైపు క్రీజులో ధోనీ ఉండటంతో చివరివరకు టీమిండియా గెలుపు ధీమాతో ఉంది. కానీ, ధోనీ ఈ పిచ్పై పరుగులు రాబట్టడం గగనమైంది.

49వ ఓవర్లో అవుటైన ధోని
సింగిల్స్ కూడా కష్టమైన దశలో ధోనీ 49వ ఓవర్ చివరి బంతికి భారీ షాట్ ఆడబోయి అవుటయ్యాడు. లక్ష్యఛేదనకు ఏడు బంతులకు 14 పరుగులు చేయాల్సిన దశలో ధోని అవుట్ కావడంతో వెస్టిండీస్ విజయం ఖాయమైంది. ధోని అవుటైన తర్వాత టీమిండియా వరుసగా వికెట్లను కోల్పోయింది. 49.4 ఓవర్లో 178 పరుగులకు భారత్ ఆలౌటైంది. దీంతో కోహ్లీసేనపై వెస్టిండిస్ 11 పరుగుల తేడాతో విజయం సాధించింది.

విండిస్ ఆటగాళ్లు సంతోషం
నాలుగో వన్డేలో విండిస్ విజయం సాధించడంతో ఆటగాళ్లు సంతోషంగా ఒకరిని మరొకరు అభినందించుకున్నారు. అయితే స్వల్ప లక్ష్యాన్ని చేధించడంలో భారత్ విఫలమైందన్న బాధతో ధోని డ్రెస్సింగ్ రూమ్లో ఒంటరిగా కూర్చున్నాడు. అంతేకాదు ధోని కంటతడి పెట్టినట్లుగా టీవీ ఇమేజి వీడియోల్లో మనం చూడొచ్చు. నిజానికి ఈ ఓటమి కెరీర్పై పెద్దగా ప్రభావం చూపదు. అయినప్పటికీ గతంలో ఎన్నడూ చూడని విధంగా ఈ మ్యాచ్ ఓటమితో ధోని ముభావంగా అలా చూస్తూ కూర్చుండి పోయాడు.
కెరీర్లో ఎన్నో గెలుపు ఓటములు
నిజానికి ధోని తన కెరీర్లో ఎన్నో గెలుపు ఓటములను చూశాడు. అయితే ఈ ఓటమి ఎందుకో ధోని మనసుని తాకిందని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. ఈ మ్యాచ్లో ధోని ఓ చెత్త రికార్డుని కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్లో ధోని 46 ఓవర్ వరకు ఎంతో నిదానంగా.. మరెంతో ఓపిగ్గా ఆడిన 114 బంతుల్లో 54 పరుగులు చేశాడు. ఇందులో అర్ధసెంచరీని సాధించడానికి ధోనికి 108 బంతులు అవసరమయ్యాయి. దీంతో ధోని తన పేరు మీద ఓ చెత్త రికార్డుని మూటగట్టుకున్నాడు. వన్డేల్లో అత్యంత నెమ్మదిగా అర్ధ సెంచరీని చేసిన భారత బ్యాట్స్మన్లలో ఒకడిగా నిలిచాడు. ఇది కూడా ధోనిపై ప్రభావం చూపించి ఉండొచ్చని అంటున్నారు.


Click it and Unblock the Notifications











