
హైదరాబాద్: ధోనీ డ్రెస్సింగ్ రూమ్కి ఫ్రెండ్ని తీసుకొచ్చాడంటే ఏ చిన్ననాటి స్నేహితుడినో, దగ్గరి బంధువునో కాదు. ఇదో సెక్యూరిటీ డాగ్. మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్కు చెందినదీ కుక్క. దీనినే 2013లో ఎంసీఏ నుంచి దత్తత తీసుకోవాలని ధోనీ ప్రయత్నించాడు. ఇప్పుడు తమ హోమ్ మ్యాచ్లను పుణెలో ఆడుతుండటంతో ఈ కుక్క మళ్లీ ధోనీకి కనిపించింది. దీంతో అతను వెంటనే దానిని తీసుకొని డ్రెస్సింగ్ రూమ్కి వెళ్లాడు. నా ఫ్రెండ్ వచ్చింది అంటూ అందరికీ పరిచయం చేశాడు.
కావేరీ జలాల వివాదం నేపథ్యంలో చెన్నైలో జరగాల్సిన మ్యాచ్లను పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో నిర్వహించనుంది. చెన్నైలోని స్టేడియంలో ఆందోళనకారులు అల్లర్లు జరుపుతుండటంతో భద్రతా కారణాల రీత్యా బీసీసీఐ ఆ మ్యాచ్ లన్నింటిని పూణెలో నిర్వహించేందుకు నిర్ణయించింది.
దీంతో పూణెలో జరిగిన మ్యాచ్లో ధోనీ ఇలా తన ఫ్రెండ్తో డ్రెస్సింగ్ రూమ్ పంచుకున్నాడు. ఈ విషయాన్ని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకుంది. ఆ వీడియోలో ధోనీ సహచరుడు దీపక్ చాహర్ పక్కన ఉండగా ధోనీ తన ఫ్రెండ్ (ప్రిన్స్)తో డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్తున్న దృశ్యాన్ని చిత్రీకరించారు. ఇలా ఇంతకుముందు కూడా ధోనీ స్టేడియంలో ఇలా సంచరించాడు.
ప్రస్తుత ఐపీఎల్ లీగ్ జాబితాలో చెన్నై సూపర్ కింగ్స్ రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇప్పటివరకూ 10 మ్యాచ్లలో ఆడి ఏడింటిలో గెలిచింది. ధోనీ తన అనుభవన్నంతా వాడి ఐపీఎల్లో జట్టును దూకుడుగా తీసుకుపోతున్నాడు. ఇప్పటి వరకూ ఆడిన అన్ని మ్యాచ్ల కంటే ఐపీఎల్ 11లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి తన పూర్వపు ఫామ్ను చూపిస్తున్నాడు.
ఇప్పటి వరకూ ఆడిన 10 మ్యాచ్లు కలిపి 360పరుగులు పూర్తి చేశాడు. 90యావరేజ్తో 165.89 స్ట్రైక్ రేట్తో దూసుకెళ్తున్నాడు. ఈ ఐపీఎల్ లో అత్యధిక పరుగులు చేస్తున్న బ్యాట్స్మెన్లలో ధోనీ ఆరో స్థానంలో ఉన్నాడు. ధోనీ తర్వాతి స్థానంలో విరాట్ కోహ్లీ, క్రిస్ గేల్, డివిలియర్స్ ఉన్నారు. అయితే చెన్నై తదుపరి మ్యాచ్ మే11న రాజస్థాన్ రాయల్స్తో జైపూర్ వేదికగా తలపడనుంది.