హైదరాబాద్: కర్ణాటక ప్రీమియర్ లీగ్ ఆరంభమై వారం రోజులైంది. అయితే ఆదరణ మాత్రం అంతంత మాత్రమే. ఇందుకు కారణం కర్ణాటకకు చెందిన స్టార్ ప్లేయర్లు కేఎల్ రాహుల్, మనీష్ పాండేలు అంతర్జాతీయ మ్యాచ్ లో బిజీగా ఉండటమే. దీంతోనే కర్ణాటక ప్రీమియర్ లీగ్కు కళ తప్పిందని క్రీడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
శుక్రవారం చోటు చేసుకున్న సంఘటన కారణంగా కర్ణాటక ప్రీమియర్ లీగ్ ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది. ఇందుకు కారణం ఆల్ రౌండర్ స్టువర్ట్ బిన్నీ, అతని భార్య మయాంతి లాంగర్ లే. బ్రాడ్ కాస్టింగ్ కవరేజ్లో భాగంగా శుక్రవారం నాటి మ్యాచ్కు హాజరైన మయాంతి తన భర్త స్టువర్ట్ బిన్నీని ఇంటర్వ్యూ చేసింది.

కర్ణాటక ప్రీమియర్ లీగ్ లో బెలగావీ పాంథర్స్ తరపున ఆడుతున్న స్టువర్ట్ బిన్నీ బెంగాళూరు బ్లాస్టర్స్తో జరిగిన మ్యాచ్లో 46 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 87 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన బెలగావీ పాంథర్స్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 192 పరుగులు చేసింది.
అనంతరం 193 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు బ్లాస్టర్స్ 19.3 ఓవర్లలో 169 పరుగులు చేసి ఆలౌటైంది. ఆల్ రౌండర్ అయిన స్టువర్ట్ బిన్నీ బౌలింగ్లో కూడా రెండు వికెట్లతో రాణించాడు. దాంతో పాంథర్స్ విజయంలో కీలక పాత్ర పోషించిన స్టువర్ట్ బిన్నీని ఇంటర్య్వూ చేసే అవకాశం మయాంతికి వచ్చింది.
దీంతో తన భర్తను తానే ఇంటర్యూ చేయడంతో ట్విట్టర్లో మయాంతిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. భర్తను ఇంటర్య్యూ చేయడం అత్యున్నతమైన గిఫ్ట్ అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు.