హైదరాబాద్: లార్డ్స్ వేదికగా వెస్టిండిస్తో జరిగిన మ్యాచ్లో ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ టెస్టుల్లో 500 వికెట్ల మైలురాయిని అందుకున్న సంగతి తెలిసిందే. మూడు టెస్టు మ్యాచ్ల సిరిస్లో భాగంగా లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్లో జరిగిన మూడో టెస్టులో ఆండర్సన్ ఈ ఘనత సాధించాడు.
మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్లో క్రెయిగ్ బ్రాత్వైట్ను బౌల్డ్ చేసి అండర్సన్ ఈ మైలురాయిని అందుకున్నాడు. 129 టెస్టుల్లో ఆండర్సన్ ఈ ఘనత సాధించడం విశేషం. అంతకాదు అంతర్జాతీయ క్రికెట్లో 500 వికెట్లు తీసిన తొలి ఇంగ్లండ్ బౌలర్గా ఆండర్సన్ చరిత్ర సృష్టించాడు.

పేసర్లలో ఈ ఘనత సాధించిన మూడో బౌలర్గా నిలిచాడు. ఇక టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో శ్రీలంకకు చెందిన ముత్తయ్య మురళీధరన్ (800) అగ్రస్ధానంలో ఉండగా, ఆ తర్వాతి స్ధానాల్లో షేన్ వార్న్ (708), అనిల్ కుంబ్లే (619), మెక్గ్రాత్ (563), వాల్ష్ (519)లు అతనికంటే ముందున్నారు.
ఈ క్రమంలో తన అభిమాన క్రికెటర్ ఆండర్సన్ క్రికెట్ చరిత్రలోనే అరుదైన ఘనత సాధించిన క్రమంలో ప్రేయసికి తన ప్రేమను వ్యక్తపరచాలని అనుకున్నాడు ఓ ప్రేమికుడు. అనుకున్నదే తడవుగా లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్లోనే తన ప్రేమను వ్యక్తపరిచాడు. ఇంగ్లాండ్-వెస్టిండీస్ మధ్య మూడో టెస్టు రెండో రోజు ఆటలో ఆండర్సన్ టెస్టుల్లో 500వ వికెట్ తీసిన సంగతి తెలిసిందే.
దీంతో స్టేడియంలో ఇంగ్లండ్ ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు. ఇక, గ్యాలరీ నుంచి మ్యాచ్ని వీక్షిస్తున్న అభిమానులు సైతం ఆండర్సన్ని అభినందించారు. ఇంతలో ఓ వ్యక్తి మోకాళ్లపై నిల్చుని పక్కనే ఉన్న తన ప్రేయసికి తన ప్రేమను వ్యక్తపరిచాడు. ఈ ఊహించని ఘటనతో ఆమె ఒకింత ఆశ్చర్యానికి గురైంది.
అయినప్పటికీ అతని ప్రేమను అంగీకరించింది. దీంతో వెంటనే అతడు ఆమెకు ఉంగరం తొడిగాడు. దీనికి సంబంధించిన వీడియోను లార్డ్స్ స్టేడియం నిర్వాహకులు 'ఎంగేజ్మెంట్ ఎట్ లార్డ్స్' పేరిట ఫేస్బుక్ ఖాతాలో పోస్టు చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.